జైట్లీ జీవితంలో క్రికెట్
- Subhan Ali Shaik
- Published On : August 24, 2019 / 07:42 AM IST
భారత దేశ అభివృద్ది కోసం నిత్యం పోరాడిన అరుణ్ జైట్లీ రాజకీయాల్లోనే కాదు. క్రికెట్లోనూ సేవలందించారు. క్రికెట్ పాలక మండళ్లలో బాధ్యతలు చేపట్టి ఆ క్రీడాభివృద్ధికి సహకరించారు. భారత క్రికెట్ బోర్డు(బీసీసీఐ) వైస్ ప్రెసిడెంట్, ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ సభ్యుడిగా జైట్లీ కృషి చేశారు. జాతీయ క్రికెట్ పదవి బాధ్యతలు చేపట్టకముందు ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగానూ వ్యవహరించారు.
క్రికెట్పై అతనికున్న ప్రత్యేకాస్తితోనే ఈ పదవులు చేపట్టారు. ఒకానొక దశలో బీసీసీఐ ప్రెసిడెంట్ పదవికి సైతం జైట్లీ పేరు ప్రస్తావనలో రావడం విశేషం. డీఆర్ఎస్ రద్దు వంటి కీలక చర్చల్లో అరుణ్ జైట్లీ పాల్గొన్నారు.
1952, నవంబర్ 28న ఢిల్లీలో జన్మించిన కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ శనివారం ఎయిమ్స్ హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటూ మృతి చెందారు. కొద్దిరోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతున్న సంగతి తెలిసిందే. ఆగస్టు 9వ తేదీన శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది రావడంతో ఆయన్ను ఎయిమ్స్లో చేర్పించి చికిత్స అందించారు.
