Former JD(S) MP Prajwal Revanna
Prajwal Revanna: అత్యాచారం కేసులో కర్ణాటక మాజీ ఎంపీ, జేడీఎస్ అధినేత దేవెగౌడ మనవడు ప్రజ్వల్ రేవణ్ణకు భారీ షాక్ తగిలింది. ఆయన్ను దోషిగా నిర్ధారిస్తూ శుక్రవారం బెంగళూరు ప్రజాప్రతినిధుల న్యాయస్థానం తీర్పు వెల్లడించింది. శనివారం ఆయనకు శిక్ష ఖరారు చేయనుంది. ప్రజ్వల్ రేవణ్ణ తన ఇంటి పనిమనిషిపై అత్యాచారంకు పాల్పడిన కేసులో ప్రత్యేక కోర్టు దోషిగా నిర్ధారించింది. అత్యాచారం కేసు, అశ్లీల వీడియోల కేసుకు సంబంధించి అతనిపై మొత్తం నాలుగు కేసులు నమోదు కాగా.. మొదటి కేసులో కోర్టు ఈ తీర్పును ఇచ్చింది. న్యాయమూర్తి సంతోష్ గజానన్ శనివారం శిక్షను ప్రకటించనున్నారు.
ప్రజ్వల్ రేవణ్ణ మాజీ ప్రధాని దేవగౌడ మనవడు, మాజీ మంత్రి హెచ్డీ రేవణ్ణ తనయుడు. 2019 ఎన్నికల్లో హసన్ లోక్సభ నియోజకవర్గం నుంచి జేడీఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగి విజయం సాధించాడు. అయితే, 2023లో అఫిడవిట్ లో లోపాల కారణంగా కర్ణాటక హైకోర్టు ఆయన ఎంపీ పదవిపై అనర్హత వేటు వేస్తూ తీర్పు ఇచ్చింది.
కోవిడ్ సమయంలో హసన్లోని గన్నికాడ ఫామ్హౌజ్లో ప్రజ్వల్ తనపై రెండు సార్లు అత్యాచారం చేసినట్లు బాధితురాలు 2024 ఏప్రిల్లో పోలీసులను ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ ఘటనను ప్రజ్వల్ తన మొబైల్ లో వీడియో తీసినట్లు ఆమె ఆరోపించింది. అంతేకాదు.. ప్రజ్వల్ తల్లిదండ్రులు తనను కిడ్నాప్ చేసి బెదిరించారని కూడా ఆమె ఆరోపించింది. ఈ కేసులో సిట్ దర్యాప్తు ముమ్మరంగా జరిగింది. ఈ కేసులో సెప్టెంబర్ 2024లో సిట్ 1,632 పేజీల ఛార్జిషీట్ లను దాఖలు చేసింది.
పనిమనిషిపై అత్యాచారం ఘటన మాత్రమే కాదు.. ప్రజ్వలపై అశ్లీల వీడియోల కేసులు నమోదయ్యాయి. 2024 లోక్ సభ ఎన్నికల తరువాత ఈ వీడియోలు వెలుగులోకి రావడం కలకలం రేపింది. హసన్ లోని ఫామ్ హౌజ్ నుంచి రెండువేలకు పైగా వీడియోలు ఉన్న పెన్ డ్రైవ్ ను పోలీసులు స్వాధీనం చేసుకోవటం తీవ్ర కలకలం రేపింది. ఈ వ్యవహారం బయట పడటానికి కొద్దిరోజుల ముందు ప్రజ్వల్ 27 ఏప్రిల్ 2024లో దేశం విడిచి వెళ్లిపయాడు.
అయితే, గత ఏడాది మే 31న జర్మనీ నుంచి స్వదేహానికి తిరిగొచ్చిన రేవణ్ణను ఎయిర్ పోర్టులో పోలీసులు అరెస్టు చేశారు. అతను గత 14 నెలలుగా జ్యుడీషియల్ కస్టడీలోనే ఉన్నాడు. శుక్రవారం బెంగళూరులోని ప్రజాప్రతినిధుల న్యాయస్థానం అతన్ని దోషిగా నిర్ధారిస్తూ తీర్పు వెలువరించింది. ఈ తీర్పు వినగానే ప్రజ్వల్ కోర్టు గదిలోనే కంటతడి పెట్టుకున్నాడు. శనివారం న్యాయస్థానం రేవణ్ణుకు శిక్షను ఖరారు చేయనుంది.