దేశంలో కరోనా వ్యాప్తి నిరోధానికి ప్రజలంతా లాక్ డౌన్ పాటిస్తుంటే…. కొన్ని రాష్ట్రాల్లో పోలీసులకు మాస్క్ లు కూడా కరువయ్యాయి. పగలనకా, రాత్రనకా ప్రాణాలు పణంగా పెట్టి ప్రజలను కాపాడుతున్న పోలీసుల రక్షణకు మాస్క్ లు కూడా లేవు. ఇలాంటి పరిస్ధితిలో చత్తీస్ ఘడ్ లో ఒక మాజీ మావోయిస్టు పోలీసుల కోసం మాస్క్ లు కుట్టేందుకు ముందుకు వచ్చాడు.
ఇప్పుడు అతను మాస్క్ లు కుట్టే పనిలో బిజీగా ఉన్నాడు. మావోయిస్టు ఉద్యమంలో ఉన్న సమయంలో పోలీసులను ఎదుర్కోటానికి తుపాకులు పట్టిన చేతులు ఇప్పుడు పోలీసుల కోసమే మాస్క్ లు కుట్టటం వార్త అయ్యింది.
సుక్మా జిల్లాకు చెందిన మడకం లఖా 1998 లో మావోయిస్టు ఉద్యమంవైపు ఆకర్షితుడై పార్టీలో చేరాడు. పార్టీలోని వివిధ హోదాల్లోనూ పనిచేసిన లఖా పార్టీలో ఉండగా కొన్నాళ్లు కేడర్ కు యూనిఫాం కుట్టేవాడు. 2019 లో పోలీసులకు లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలిసి జీవనంసాగిస్తున్నాడు. దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తికి లాక్ డౌన్ ప్రకటించటంతో సుక్మా జిల్లాలో పోలీసులు ధరించటానికి మాస్క్ లు లేవనే విషయం తెలిసి స్వఛ్చందంగా వారికి మాస్క్ లు కుట్టి ఇవ్వటానికి ముందుకు వచ్చాడు.
ప్రస్తుతం అతను రోజుకు 90 మాస్క్ లు కుడుతున్నాడు. పోలీసులు అందుకు తగిన ప్రతి ఫలం అందిస్తున్నారు. ఇప్పటివరకు అతను మాస్క్ లు కుట్టటం ద్వారా 15 వేల రూపాయలు సంపాదించాడు. ఆంధ్రప్రదేశ్, బీహార్, ఛత్తీస్ఘడ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, తెలంగాణ, మరియు పశ్చిమ బెంగాల్ మరియు తూర్పు ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాలలో విస్తరించి ఉన్న ప్రాంతం మావోయిస్టులు ‘రెడ్ కారిడార్’ గా పిలుచుకుంటారు.
ఇటీవలి కాలంలో బస్తర్ జిల్లాలో 17 మంది పోలీసులను మావోయిస్టులు మట్టుపెట్టారు. అయితే, గత2 వారాలుగా దేశవ్యాప్తంగా అమలవుతున్న COVID-19 వైరస్ వ్యాప్తి నిరోధంలో భాగంగా… పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ (PLGA) కూడా ఏకపక్ష కాల్పుల విరమణను ప్రకటించింది. వారు భద్రతా దళాలపై దాడి చేయబోమని ప్రకటించారు.
మల్కన్గిరి – కొరాపుట్ – విశాఖ డివిజనల్ కమిటీ (ఎమ్కెవిడిసి) కార్యదర్శి కైలాసం పేరుమీద విడుదల చేసిన ప్రకటనలో పార్టీ, పార్టీలోని వివిధ సంస్థలు… భద్రతా దళాలపై ఎలాంటి దాడులు చేయకూడదని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.
Also Read | భారత ఎకానమీకి పెద్ద దెబ్బ : 21రోజుల లాక్ డౌన్ ఖరీదు రూ. 8లక్షల కోట్లు