Vice President: రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్మును ప్రకటించిన ఎన్డీఏ ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా పంజాబ్ మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ను ప్రకటించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. 80 ఏళ్ల కెప్టెన్ అమరీందర్ వెన్నెముక సర్జరీ కోసం ప్రస్తుతం లండన్లో ఉన్నారు.
రాష్ట్రపతి అభ్యర్థిత్వానికి నామినేషన్ వేసే చివరి తేదీ జూలై 19 కాగా, ఎన్నికలు ఆగస్టు 6న జరగనున్నాయి. ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు పదవీకాలం ఆగస్టు 10వ తేదీతో ముగియనుంది. దీనికి ముందే కొత్త ఉపరాష్ట్రపతి ఎన్నిక పూర్తవుతుంది.
లండన్ నుంచి అమరీందర్ సింగ్ తిరిగి రాగానే తన పంజాబ్ లోక్ కాంగ్రెస్ (పీఎల్సీ) పార్టీని బీజేపీలో విలీనం చేసే అవకాశాలున్నట్లు కనిపిస్తుంది. పంజాబ్ లోక్ కాంగ్రెస్ ఇంతవరకూ ఎటువంటి ప్రకటన చేయకపోయినప్పటికీ, దీనికి సంబంధించిన నిర్ణయం తీసుకున్నట్టు పంజాబ్ బీజేపీ సీనియర్ నేత హర్జి సింగ్ గ్రెవాల్ శనివారం తెలిపారు.
Read Also : పంజాబ్ మాజీ సీఎం అమరీందర్ సింగ్ ఓటమి..
లండన్కు వెళ్లే ముందే తన పార్టీని బీజేపీలో విలీనం చేసే ఉద్దేశం ఉందని సింగ్ అభిప్రాయం వ్యక్తం చేశారని, లండన్ నుంచి రాగానే పార్టీ విలీనంపై ప్రకటన చేస్తారని గ్రెవాల్ పేర్కొన్నారు. గతేడాది పంజాబ్ సీఎం పదవి నుంచి కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం అమరీందర్ను తొలగించింది. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీకి వీడ్కోలు చెప్పిన అమరీందర్ పీఎల్సీ పార్టీని ఏర్పాటు చేసుకున్నారు.
2022 పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతోనూ, సుఖ్దేవ్ సింగ్ ధిండ్సా సారథ్యంలోని శిరోమణి అకాలీ దళ్ (సంయుక్త్)తోనూ పొత్తు పెట్టుకుని పోటీ చేశారు. అమరీందర్ పాటియాలా అర్బన్ సీటు నుంచి పోటీ చేసి ఓడిపోయారు. పీఎల్సీకి చెందిన ఒక్క అభ్యర్థి కూడా గెలవకపోవడం విచారకరం.