వరుసగా 12వ రోజు పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
- Naveen
- Published On : February 20, 2021 / 10:43 AM IST
fuel prices hike 12th day: దేశంలో ఇంధన ధరల సెగ కంటిన్యూ అవుతోంది. పెట్రో ధరలు భగ్గుమంటున్నాయి. వరుసగా 12వ రోజు కూడా చమురు కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలు పెంచాయి. రికార్డు స్థాయికి ఇంధన ధరలు పెరగడంతో వాహనదారులు బెంబేలెత్తిపోతున్నారు. వాహనం బయటకు తియ్యాలంటేనే జంకుతున్నారు. దేశవ్యాప్తంగా శనివారం(ఫిబ్రవరి 20,2021) డీజిల్పై లీటర్ కు 35-40 పైసలు, పెట్రోల్ పై లీటర్ కు 30-40 పైసల మేర ధరలను పెంచాయి చమురు కంపెనీలు. తాజా పెంపుతో నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు సరికొత్త రికార్డును తాకాయి.
నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు లీటర్ కు..
ఢిల్లీలో పెట్రోల్ రూ.90.58, డీజిల్ రూ.80.97
ముంబైలో పెట్రోల్ రూ.97, డీజిల్ రూ. 88.05
చెన్నైలో పెట్రోల్ రూ.92.59, డీజిల్ రూ.85.98
బెంగళూరులో పెట్రోల్ రూ.93.61, డీజిల్ రూ. 85.84
కోల్ కతాలో పెట్రోల్ రూ.97.78, డీజిల్ రూ.84.56
హైదరాబాద్ లో పెట్రోల్ రూ.94.18, డీజిల్ రూ.88.31
అమరావతిలో పెట్రోల్ రూ.96.73, డీజిల్ రూ. 90.33
విజయవాడలో పెట్రోల్ రూ.97.01, డీజిల్ రూ.90.58
రోజురోజుకి రికార్డు స్థాయిలో పెరుగుతూ పోతున్న ఇంధన ధరలు వాహనదారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి. ఇక వాహనాలు అమ్మేయడం బెటర్ అని ఫీల్ అవుతున్నారు. కాగా, ఇంధన ధరలపై ప్రతిపక్షాలు మండిపడుతున్నా… కేంద్రం మాత్రం పట్టించుకోవట్లేదు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు తలచుకుంటే ధరలను తగ్గించొచ్చు. పన్నులు తగ్గిస్తే… ధరలు తగ్గుతాయి. కానీ అలాంటి ఆలోచనలో ఉన్నట్లు కనిపించట్లేదు. డీజిల్ ధర పెంపుతో… నిత్యవసర వస్తువుల ధరలు కూడా పెరుగుతున్నాయి. మరోవైపు గ్యాస్ బండ ధరను కూడా ఇప్పటికే పెంచేశారు. ఇలా అన్నింటి ధరలు పెరుగుతుండటంతో సామాన్యుడి నడ్డి విరిగింది. బతికేది ఎలాగో తెలియక సామాన్యుడు విలవిలలాడుతున్నాడు.
