Gen Bipin Rawat: జనరల్ బిపిన్ రావత్‌కు నివాళులు

హెలికాప్టర్‌ ప్రమాదంలో మృతిచెందిన సీడీఎస్‌ జనరల్‌ బిపిన్ రావత్‌ దంపతుల అంత్యక్రియలు సైనిక లాంఛనాలతో జరగుతున్నాయి.

Bipin Rawat

Gen Bipin Rawat: హెలికాప్టర్‌ ప్రమాదంలో మృతిచెందిన సీడీఎస్‌ జనరల్‌ బిపిన్ రావత్‌ దంపతుల అంత్యక్రియలు సైనిక లాంఛనాలతో జరగుతున్నాయి. ఇద్దరి పార్థివ దేహాలను ఢిల్లీలోని వారి స్వగృహంలో ఉదయం 11 గంటల నుంచి ప్రజల సందర్శనార్థం ఉంచారు. కాసేపట్లో కామరాజ్‌ మార్గ్‌ నుంచి కంటోన్మెంట్‌ ప్రాంతం వరకు అంతిమయాత్ర నిర్వహించబోతున్నారు అధికారులు.

సాయంత్రం 4గంటలకు బ్రార్‌ స్క్వేర్‌ శ్మశానవాటికలో బిపిన్‌ రావత్‌ దంపతుల అంత్యక్రియలు పూర్తి కానున్నాయి. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. సీడీఎస్​ బిపిన్ రావత్‌తో సహా.. 13మంది అమరులకు యావత్‌ దేశం నివాళులర్పిస్తోంది. పాలెం ఎయిర్‌బేస్‌లో బిపిన్‌ రావత్‌, మధులికతో పాటు 13 మంది అమరుల పార్థివదేహాలకు ప్రధాని మోదీ నివాళులర్పించారు. పుష్పాంజలి ఘటించి.. సైనికుల కుటుంబ సభ్యులను ఓదార్చారు.

కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ అమరులకు నివాళులర్పించి శ్రద్ధాంజలి ఘటించారు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్​ దోవల్, ఆర్మీ చీఫ్ నరవాణె, ఎయిర్ ఫోర్స్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌదరి, నేవీ చీఫ్‌ అడ్మిరల్ జనరల్ హరి కుమార్‌తో సహా పలువురు ప్రముఖులు నివాళులు అర్పించారు. దేశవ్యాప్తంగా అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించారు ప్రజలు. అమరుల మృతికి సంతాపంగా ర్యాలీలు నిర్వహిస్తున్నారు. జై జవాన్‌, భారత్‌మాతాకీ జై నినాదాలతో హోరెత్తుతున్నాయి.