GST Collection : అక్టోబర్ లో భారీగా జీఎస్టీ వసూళ్లు..ఇదే రెండో అత్యధికం

కోవిడ్ సంక్షోభం నుంచి పలు రంగాలు కోలుకోవడంతో కొద్ది నెలలుగా జీఎస్టీ వసూళ్లు భారీగా పెరుగుతున్నాయి. వరుసగా నాలుగో నెల జీఎస్టీ వసూళ్లు రూ.లక్ష కోట్లను అధిగమించాయి.

Gst

GST Collection కోవిడ్ సంక్షోభం నుంచి పలు రంగాలు కోలుకోవడంతో కొద్ది నెలలుగా జీఎస్టీ వసూళ్లు భారీగా పెరుగుతున్నాయి. వరుసగా నాలుగో నెల జీఎస్టీ వసూళ్లు రూ.లక్ష కోట్లను అధిగమించాయి. అక్టోబరు నెలకు గానూ రూ.1,30,127 కోట్ల జీఎస్టీ వసూలైనట్లు సోమవారం కేంద్ర ఆర్థికశాఖ ప్రకటించింది.

ఇందులో కేంద్ర జీఎస్టీ(CGST) వాటా రూ.23,861 కోట్లు కాగా.. రాష్ట్రాల జీఎస్టీ(SGST)వాటా రూ.30,421 కోట్లు. సమ్మిళిత జీఎస్టీ(IGST) వాటా రూ.67,361 కోట్లు(వస్తువుల దిగుమతులపై వసూలు చేసిన రూ.32,998 కోట్లతో కలిపి), సెస్‌ రూపంలో రూ.8,484 కోట్లు(వస్తువుల దిగుమతులపై వసూలు చేసిన రూ.699 కోట్లతో కలిపి) వసూలైనట్లు ఆర్థికశాఖ తెలిపింది.

సమ్మిళిత జీఎస్‌టీ వాటా నుంచి సీజీఎస్ఆర్ కు రూ.27,310 కోట్లు, రాష్ట్రాలతో రూ.22,394 కోట్లు పంచుకొనున్నట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. మొత్తం వాటా పంచుకున్న తర్వాత కేంద్రం వాటా రూ.51,171 కోట్లు, రాష్ట్రాల వాటా రూ.52,815 కోట్లుగా ఉంది. దిగుమతుల నుంచి వచ్చిన ఆదాయం గత ఏడాది కంటే 39 శాతం ఎక్కువగా ఉంది. చిప్ కొరత వల్ల కార్లు, ఇతర ఉత్పత్తుల అమ్మకాలు ప్రభావితం కాకపోతే ఇంకా ఆదాయం ఎక్కువగా వచ్చి ఉండేదని ఆర్థిక మంత్రిత్వ శాఖ పేర్కొంది.

అయితే 2017 జులైలో జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత ఇదే(అక్టోబర్ నెల) రెండవ అత్యధిక ఆదాయం కావడం విశేషం. ఈ ఏడాది అక్టోబర్ ఆదాయం గత ఏడాది అక్టోబర్ నెలతో పోలిస్తే 24 శాతం, అక్టోబర్ 2019-20తో పోలిస్తే 36 శాతం ఎక్కువ. కాగా, 2021 ఏప్రిల్‌ నెలలో రూ.1.41లక్షల కోట్లతో జీఎస్టీ వసూళ్లు ఆల్‌టైం రికార్డును తాకిన విషయం తెలిసిందే.

ALSO READ Yogi On Akhilesh Jinnah Remark : ఇది తాలిబనీ మనస్తత్వం..అఖిలేష్ యాదవ్ క్షమాపణ చెప్పాల్సిందే