Iftar In Temple : కులం పేరుతో మతం పేరుతో మనుషులు కొట్టుకుచస్తున్న రోజులు ఇవి. కులం, మతం పేరు చెప్పి స్వార్థ రాజకీయాలు నడుపుతున్న రోజులు ఇవి. కులం, మతం పేరుతో పబ్బం గడుపుకుంటున్న రోజులు ఇవి. అలాంటి ఈ రోజుల్లోనూ అక్కడక్కడ మత సామరస్యం వెల్లివిరుస్తోంది. మతాలు మనుషులను వేరు చేయలేవని, మనుషులంతా ఒక్కటే అని నిరూపిస్తున్నారు కొందరు. అలాంటి ఘటన ఒకటి గుజరాత్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.
గుజరాత్ లో మతసామరస్యం విల్లివిరిసింది. హిందువుల ఆలయంలో ముస్లింలకు ఇఫ్తార్ విందు ఇచ్చారు. బనస్ కాంతలని వడదం తాలూక హడియాల్ అనే చిన్న గ్రామంలో ముస్లింలు రంజాన్ ఉపవాసాన్ని విరమించేందుకు(ఇఫ్తార్ విందు) 1200 ఏళ్ల చరిత్ర ఉన్న ఆలయాన్ని తెరిచారు. 100 మంది ముస్లిం సోదరుల కోసం గ్రామ పంచాయితీ, ఆలయ ట్రస్ట్ 6 రకాల పండ్లు, ఖర్జూరాలు, షర్బత్, రకరకాల ఆహార పదార్ధాలు సిద్ధం చేశాయి. తమ గ్రామం మత సామరస్యానికి ప్రతీక అని, పండుగలు అన్నీ కలిసే చేసుకుంటామని ముస్లింలు చెప్పారు.
మసీదులో మంత్రోచ్ఛరణల మధ్య.. హిందూ యువతి పెళ్లి జరిపించిన ముస్లింలు
వరదవీర్ మహరాజ్ ఆలయానికి ఎంతో చరిత్ర ఉంది. ఇది పురాతమైన ఆలయం. ముస్లింల కుటుంబాలు ఈ ఆలయ నిర్మాణం కోసం తమ భూములు ఇచ్చాయి. దీంతో ముస్లింలకు ఈ ఆలయానికి అనుబంధం ఉంది. ఆలయంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసి ముస్లిం సోదరులను ఆహ్వానించాలనే ఆలోచన గ్రామ సర్పంచి భూపతిసిన్హ్ హడియాల్ కి వచ్చింది. ఇదే విషయాన్ని ఆయన గ్రామస్తులో చెప్పారు. వారంతా ఈ ప్రతిపాదనకు అంగీకారం తెలిపారు.
ఆ తర్వాత అంతా కలిసి ఆలయంలో ఇఫ్తార్ విందుకు ఏర్పాట్లు చేశారు. చుట్టుపక్కల గ్రామాల్లోని ముస్లిం సోదరులను ఇఫ్తార్ విందుకి ఆహ్వానించారు. ఆలయంలోనే ఓ చోట నమాజ్ చేసుకోవడానికి స్థలం కూడా కేటాయించారు. అంతేకాదు, ఆ ఆలయంలో నిత్యం పూజలు జరుగుతాయని సర్పంచ్ తెలిపారు. రోజూ ఆలయంలోని వీర్ మహరాజ్ కి ఆరతి ఇస్తామని ఆయన వెల్లడించారు.