Health Ministry : కోవిడ్ మరణాలపై ఆ లెక్కలు తప్పు..కేంద్రం క్లారిటీ
భారత్ లో కోవిడ్ సెకండ్ వేవ్ ప్రభావానికి 2.5లక్షల మందికి పైగా చనిపోయినట్లు వచ్చిన కొన్ని మీడియా సంస్థల కథనాలను కేంద్రం తోసిపుచ్చింది.
- venkaiahnaidu
- Published On : July 14, 2021 / 05:36 PM IST
Health Ministrey
Health Ministry భారత్ లో కోవిడ్ సెకండ్ వేవ్ ప్రభావానికి 2.5లక్షల మందికి పైగా చనిపోయినట్లు వచ్చిన కొన్ని మీడియా సంస్థల కథనాలను కేంద్రం తోసిపుచ్చింది. జాతీయ ఆరోగ్య మిషన్కు చెందిన వైద్య నిర్వహణ సమాచార వ్యవస్థ(HMIS) డేటా ఆధారంగా ఎక్కువ కొవిడ్ మరణాలు సంభవించినట్లు కొన్ని మీడియా సంస్థలు పేర్కొన్న నేపథ్యంలో బుధవారం దీనిపై కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ స్పందించింది. ఎలాంటి ప్రత్యేమ్నాయ ఆధారాలు లేకుండా సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్(CRS), HMIS డేటాను పోల్చి.. కొవిడ్ మృతులను కొన్ని మీడియా సంస్థలు తప్పుగా పేర్కొన్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. ఇవన్నీ అవాస్తవాలని పేర్కొంది
HMISలో పొందిపరిచిన మరణాల సంఖ్యలను ఉటంకిస్తూ…ఇతర సమాచారం లేనప్పుడు.. అన్నీ కొవిడ్ మరణాలుగానే పరిగణిస్తూ కొన్ని మీడియా సంస్థలు పేర్కొన్నాయి. దాని ప్రకారం 2.50 లక్షల మరణాలకు కారణమేంటన్నది తెలియలేదని ఆరోగ్యశాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. ఎలాంటి ఆధారాలు లేని మరణాలను కరోనా మరణాలుగా పేర్కొనడం సరికాదని తెలిపింది.
కొవిడ్ డేటా మేనేజ్ మెంట్ కు సంబంధించిన విధానంలో కేంద్రం పారదర్శకంగా ఉందని.కరోనా సంబంధిత మరణాలను నమోదు చేసే ప్రత్యేకమైన వ్యవస్థ ఇప్పటికే ఉందని ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది. ఇందులో కరోనా మరణాల డేటాను ఎంటర్ చేసే బాధ్యతను రాష్ట్రాలకు అప్పగించినట్లు తెలిపింది. కొవిడ్ మరణాలు సరిగ్గా నమోదు చేసేలా భారతీయ వైద్య పరిశోధన మండలి(IMA) గైడ్ లైన్స్ జారీ చేసినట్లు తెలిపింది.
