×
Ad

Himachal Pradesh Tourists Stuck : హిమాచల్ ప్రదేశ్‌లో భారీ వర్షాలు, వరదలు.. పర్యాటక ప్రాంతాల్లో చిక్కుకున్న తెలుగు విద్యార్థితోపాటు పర్యాటకులు

కులు-మనాలి, కసోల్, పార్వతి వ్యాలీలో యాత్రికులు చిక్కుకున్నారు. భారీ వర్షాలు, వరదలతో రహదారులు దెబ్బతిన్నాయి.

  • Published On : July 11, 2023 / 11:44 AM IST

Himachal Pradesh

Heavy Rains In Himachal Pradesh : ఉత్తరాది రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఢిల్లీతోపాటు హిమాచల్, ఉత్తరాఖండ్, పంజాబ్, యూపీ, హర్యానాలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. హిమాచల్ ప్రదేశ్‌లో పలు పర్యాటక ప్రాంతాల్లో పర్యాటకులు చిక్కుకుపోయారు. కులు-మనాలి, కసోల్, పార్వతి వ్యాలీలో యాత్రికులు చిక్కుకున్నారు. భారీ వర్షాలు, వరదలతో రహదారులు దెబ్బతిన్నాయి.

కొన్ని ప్రాంతాల్లో వంతెనలు కొట్టుకుపోయాయి. దీంతో ఎటూ కదల్లేని పరిస్థితుల్లో యాత్రికులు హోటళ్లలోనే ఉన్నారు. ఢిల్లీ స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ విద్యార్థులు కసోల్‌లో చిక్కుకున్నారు. విద్యార్థుల్లో తెలుగు విద్యార్థి వంగరి రాహుల్ కూడా ఉన్నారు. ఎవరి ఫోన్లూ పనిచేయకపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.

Heavy Rains : ఉత్తరాది రాష్ట్రాల్లో భారీ వర్షాలు బీభత్సం… 100 మందికి పైగా మృతి, వరద నీటిలో కొట్టుకుపోయిన భవనాలు, రోడ్లు, రైల్వే ట్రాక్లు

హిమాచల్ ప్రదేశ్‌ లో సంభవించిన వరదల్లో 72 మంది మృతి చెందారు. వరద నీటిలో 8 మంది గల్లంతు అయ్యారు. 90 మందికి పైగా గాయాలు అయ్యాయి. వేలాది కోట్ల ఆస్తి నష్టం వాటల్లింది. హిమాచల్ లో 39 కొండచరియలు విరిగిపడిన ఘటనలు చోటు చేసుకున్నాయి. 1 క్లౌడ్ బర్స్ట్, 29 ఆకస్మిక వరదలు సంభవించాయి.

ఉత్తరాది రాష్ట్రాల్లో రెండు వారాల్లో వర్షాల కారణంగా 100 మందికి పైగా మృతి చెందారు. గడిచిన రెండు రోజుల్లో 40 మందికి పైగా మృతి చెందారు. హిమాచల్, ఉత్తరాఖండ్, పంజాబ్, యూపీ, హర్యానాలో మృతుల సంఖ్య పెరుగుతోంది. వరద నీటిలో భవనాలు, రోడ్లు, రైల్వే ట్రాక్లు కొట్టుకుపోయాయి.