Uttarakhand Flood: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో ఉత్తరాఖండ్ లో వరద ఉధృతి కొనసాగుతోంది. లంబాగడ్ వద్ద ఉన్న ఖచ్డా డ్రెయిన్ లో నీటి ప్రవాహం అధికంగా ఉండటంతో భద్రీనాథ్ జాతీయ రహదారి -7(NH-7)లో కొంతభాగం కొట్టుకుపోయింది. ఈ ఘటనతో హైవేకు ఇరువైపులా యాంత్రికులు చిక్కుకుపోయారు. ఈ విషయాన్ని చమోలిలోని జిల్లా పరిపాలన అధికారులు వెల్లడించారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడి రహదారులపై రాకపోకలు నిలిచిపోయాయి. ఉత్తరాఖండ్లో భారీ వర్షాల కారణంగా జాతీయ, రాష్ట్ర రహదారులతో సహా దాదాపు 200 రోడ్లను బ్లాక్ చేశారు. గురువారం కొండచరియలు విరిగిపడటంతో దెబ్బతిన్న గంగోత్రి జాతీయ రహదారి ఉత్తరకాశీలోని బందర్కోట్లో రోజంతా నిలిచిపోయింది.
Uttarakhand : హరిద్వార్లో వరదల్లో కొట్టుకు పోతున్న యువకుడిని కాపాడిన పోలీసులు
ఉత్తరాఖండ్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ తెలిపిన వివరాల ప్రకారం.. రాష్ట్ర ప్రభుత్వం 94 PWD- నియంత్రిత రోడ్లు, 103 ప్రధాన్ మంత్రి గ్రామ్ సడక్ యోజన రోడ్లతో సహా బ్లాక్ చేయబడిన రోడ్లపై మట్టికుప్పలను తొలగించడానికి 298 యంత్రాలను అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు. ఇదిలాఉంటే చమోలీలో 49 రహదారులను బ్లాక్ చేయగా అవి అధ్వానంగా మారాయి. డెహ్రాడూన్లో 30, పౌరీ గర్వాల్లో 22, పితోర్ఘర్లో 20, రుద్రప్రయాగ్లో 18, బాగేశ్వర్లో 13 రోడ్లు దెబ్బతిన్నాయి. ఇదిలా ఉండగా శుక్రవారం కురిసిన భారీ వర్షానికి ముస్సోరీ సమీపంలోని టెహ్రీ బైపాస్ రోడ్డులో NH-707A స్ట్రెచ్ దెబ్బతిని వాహనదారులకు ప్రమాదం ఏర్పడింది. ముందు జాగ్రత్త చర్యగా ఆ మార్గంలో భారీ వాహనాల రాకపోకలను నిలిపివేశారు.
కుండపోతగా కురిసిన వర్షానికి రోడ్డు పక్కన ఉన్న కట్ట కూలిపోయింది. దీంతో ఆ రహదారులను బ్లాక్ చేసి ఎలాంటి ప్రమాదాలు చోటు చేసుకోకుండా చర్యలు చేపట్టినట్లు ముస్సోరీలోని నయాబ్ తహసీల్దార్ భూపాల్ సింగ్ చౌహాన్ తెలిపారు. కరకట్ట కూలిపోవడంతో దాదాపు సగం రోడ్డు మునిగిపోయి వాహనాలకు ప్రమాదకరంగా మారింది. శుక్రవారం రాష్ట్రమంతటా ఓ మోస్తరు వర్షం కురిసింది. డెహ్రాడూన్లో కూడా సాయంత్రం వేళల్లో భారీ వర్షం కురిసింది. రానున్న 48 గంటల్లో డెహ్రాడూన్, టెహ్రీ, పౌరీ, చంపావత్, నైనిటాల్, పితోర్గఢ్, బాగేశ్వర్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. ఇదిలాఉంటే జులై 31 వరకు ఉత్తరాఖండ్లో రుతుపవనాలు చురుగ్గా కొనసాగుతాయని, కొండచరియలు విరిగిపడటం, రాక్ఫాల్ సంఘటనలు కూడా జరిగే ప్రమాదం ఉందని ప్రాంతీయ సమావేశ కేంద్రం డైరెక్టర్ బిక్రమ్ సింగ్ చెప్పారు.