దేశంలో ఆహార అల్లర్లు జరగొచ్చు, ప్రభుత్వానికి మాజీ ఆర్థికవేత్త హెచ్చరిక

కరోనా వైరస్ వ్యాప్తి కట్టడికి కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలవుతోంది. ప్రజలు ఇళ్లకే పరిమితం అయ్యారు. గడప దాటి

  • Publish Date - March 28, 2020 / 04:07 PM IST

కరోనా వైరస్ వ్యాప్తి కట్టడికి కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలవుతోంది. ప్రజలు ఇళ్లకే పరిమితం అయ్యారు. గడప దాటి

కరోనా వైరస్ వ్యాప్తి కట్టడికి కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలవుతోంది. ప్రజలు ఇళ్లకే పరిమితం అయ్యారు. గడప దాటి బటయకు రావడం లేదు. లాక్ డౌన్ నేపథ్యంలో అన్ని రకాల వ్యాపారాలు బంద్ అయ్యాయి. షాపులు మూతపడ్డాయి. దీంతో ప్రజలు కొంత ఇబ్బంది పడుతున్నారు. పేదలు, వలస కార్మికుల పరిస్థితి మరీ దయనీయంగా ఉంది. రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి వారిది. రోజూ పనికిపోతే తప్ప ముద్ద దొరకదు. అయితే లాక్ డౌన్ కారణంగా ఉపాధి లేకుండా పోయింది. దీంతో వలస కార్మికులు జీవనోపాధి లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అదే సమయంలో తినడానికి తిండి లేక ఆకలితో అలమటిస్తున్నారు. 

ఎలాంటి ఆదాయం లేని వలస కార్మికుల ఆకలి కేకలు మంచిది కాదని నిపుణులు అంటున్నారు. ఇది మంచి పరిణామం కాదంటున్నారు. వెంటనే వలస కార్మికులకు భోజన సదుపాయం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. వలస కార్మికులకు ఆహారం అందుబాటులో లేకపోతే, ఆహార అల్లర్లు జరగొచ్చని మాజీ ఆర్థికవేత్త ప్రొణబ్ సేన్ హెచ్చరించారు. 

కరోనా వైరస్ మహమ్మారి గ్రామీణ ప్రాంతాల్లో వ్యాపిస్తే అదుపు చేయడం అసాధ్యం అని ఆయన తేల్చి చెప్పారు. దేశవ్యాప్తంగా లాక్ డౌన్ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్, బీహార్, ఢిల్లీ, ముంబై ఇతర రాష్ట్రాలకు చెందిన వేలాది మంది వలస కార్మికులు సొంతూళ్లకు పయనం అవుతున్నారు. వీరందరికి తక్షణమే భోజన సదుపాయం కల్పించాలని ప్రొణబ్ సేన్ కోరారు. లేదంటే గతంలో కరువు పరిస్థితుల్లో జరిగిన ఆహార అల్లర్లు(food riots) పునరావృతం అయ్యే ప్రమాదం ఉందన్నారు. దేశంలో వలస కార్మికులపై లాక్ డౌన్ ప్రభావం గురించి చెబుతూ ఆయనీ వ్యాఖ్యలు చేశారు.

దేశవ్యాప్తంగా లాక్ డౌన్ పరిస్థితులు ఉన్న నేపథ్యంలో పలు రాష్ట్రాల ప్రభుత్వాలు వలస కార్మికుల కోసం ఉచితంగా భోజన వసతి ఏర్పాటు చేస్తున్నాయి. ఢిల్లీలో 224 నైట్ షెల్టర్స్, 325 స్కూల్స్, ఇతర ప్రాంతాల్లో నాలుగు లక్షల మందికి మధ్యాహ్నం, రాత్రి.. భోజన వసతి కల్పిస్తామని సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించిన సంగతి తెలిసిందే. లాక్ డౌన్ ప్రధాన ఉద్దేశ్యం కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేయడమే అని ఆయన చెప్పారు.