చోరీలు, చైన్ స్నాచింగ్లే అతడి హాబీ. జైలుకు వెళ్లడం.. తిరిగి బయటకు రావడం.. మళ్లీ చోరీలు చేయడం అలవాటుగా మార్చుకున్నాడు. జైలులో శిక్ష అనుభవించినా.. అతనిలో ఎలాంటి మార్పు రాలేదు. ఈ సారి ప్లేస్ మార్చి మరీ స్కెచ్ లు వేశాడు. మహారాష్ట్ర నుంచి హైదరాబాద్కు వచ్చి చైన్ స్నాచింగ్లకు పాల్పడ్డాడు. చివరికి పోలీసుల చేతికి చిక్కి…ఇప్పుడు మరోసారి జైల్లో చిప్పకూడు తింటున్నాడు.
చైన్ స్నాచింగ్లో ఇతడిది డిఫరెంట్ స్టైల్. సాధారణంగా చైన్ స్నాచింగ్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఇద్దరు జతకడతారు. ఆ ఇద్దరు కలిసి ద్విచక్ర వాహనాలపై తిరుగుతూ పంజా విసురుతుంటారు. ఒకరు వాహనం నడిపితే…మరొకరు వెనుక కూర్చుని టార్గెట్ చేసిన వారి మెళ్లో గొలుసులు లాగేస్తుంటారు. కానీ..ఇప్పుడు చెప్పుకోబోయే కేటుగాడి స్టైలే డిఫరెంట్. ఇతడి పేరు శంకర్రావు. స్వస్థలం మహారాష్ట్ర.
చోరీలు చైన్ స్నాచింగ్లు ఇతడి హాబీ చోరీ. ఇతగాడు సింగిల్గానే సంచరిస్తూ స్నాచింగ్స్ చేస్తాడు. చాలా తెలివిగా తప్పించుకుంటాడు. అలా చోరీల్లో ఆఫ్ సెంచరీ క్రాస్ చేశాడు. సెంచరీ చేసే ప్రయత్నంలో పోలీసులకు చిక్కి బుక్కయ్యాడు.
హైదరాబాద్లో కొన్ని నెలలుగా ఆగిపోయిన చైన్స్నాచింగ్లు మళ్లీ మొదలయ్యాయి. ఆగిన చైన్ స్నాచింగ్ కేసులు మరోసారి తెరపైకి రావడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు.
ఈ మధ్యకాలంలోనే నగరంలోని మూడు పీఎస్ల పరిధిలో చైన్ స్నాచింగ్లు జరిగాయి. కాచిగూడ, లంగర్హౌజ్, ఎస్ఆర్ నగర్లో జరిగిన మూడు చైన్స్నాచింగ్లు ఒకే తరహాలో జరగడంతో.. పోలీసులు నిందితుడు ఒకడేనన్న నిర్ణయానికి వచ్చారు. చైన్ స్నాచింగ్ చేసిన తీరు, రెక్కీ చేసిన విధానాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ చైన్స్నాచర్ను పట్టుకోవడాన్ని సవాల్గా తీసుకున్నారు. నిందితుడిపై నిఘా పెట్టారు.
సిటీలో 300లకు పైగా సీసీ కెమెరాలను నిశితంగా పరిశీలించి మాటువేశారు. మొత్తానికి ఈస్ట్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు చైన్ స్నాచింగ్ ముఠా ప్రధాన సూత్రధారి పుణెకు చెందిన శంకర్రావును వలపన్ని పట్టుకున్నారు. మహారాష్ట్రలోని లాథూర్ జిల్లా, ప్రకాష్నగర్కు చెందిన శంకర్రావు తన స్వస్థలంలో సోదరుడితో కలిసి పౌల్ట్రీ ఫామ్ ఏర్పాటు చేశాడు. కొన్నేళ్ల పాటు వీరి వ్యాపారం సజావుగానే సాగింది.
వ్యాపారంలో భారీ లాభాలు వస్తుండటంతో శంకర్రావు తమ్ముడి బుద్ధి మారింది. ఆ ఫౌల్ట్రీ ఫామ్ను సొంతం చేసుకున్న అతగాడు శంకర్రావును వెళ్లగొట్టాడు. దీంతో శంకర్రావు….తేలిగ్గా డబ్బు సంపాదించడం కోసం నేరాలు చేయాలని నిర్ణయించుకున్నాడు.
లాథూర్కు చెందిన రాజు అనే పాత నేరగాడితో కలిసి రంగంలోకి దిగాడు. వీరిద్దరూ 2018లో కేవలం మూడు నెలల్లోనే 47 నేరాలు చేశారు. వీటిలో 33 చైన్ స్నాచింగ్స్ కాగా… 14 బైక్ చోరీ కేసులు ఉన్నాయి. పుణే కమిషనరేట్ పరిధిలోని 20 పోలీసుస్టేషన్లలో నేరాలకు పాల్పడిన వీరిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి.
వివిధ సీసీ కెమెరాల్లో రికార్డు అయిన ఫీడ్ను పరిశీలించిన అక్కడి పోలీసులు రాజును గుర్తించారు. దీంతో వలపన్ని అతడితో పాటు శంకర్రావును 2018 సెప్టెంబర్లో పుణేలోని హడప్సర్ పోలీసులు అరెస్టు చేశారు.
పుణేలో తాను చిక్కడానికి రాజుతో జట్టు కట్టడమే కారణమని భావించిన శంకర్రావు మరోసారి అలా జరగకూడదని జైల్లో ఉండగానే నిర్ణయించుకున్నాడు. ఒంటరిగానే చోరీలు, స్నాచింగ్లు చేయాలని అనుకున్నాడు. యరవాడ సెంట్రల్ జైలు నుంచి ఈ ఏడాది జనవరిలో బెయిల్పై విడుదలయ్యాడు. ఆ తర్వాత కొన్ని రోజులు మిన్నకుండిపోయిన ఇతగాడు ఆపై తాను ఎవరో తెలియని హైదరాబాద్ నగరాన్ని టార్గెట్ చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు.
వరుసపెట్టి 20 నుంచి 30 స్నాచింగ్స్ చేసి స్వస్థలానికి వెళ్ళిపోవాలని పథకం వేశాడు. జులై మొదటి వారంలో నగరానికి వచ్చిన ఇతను దినసరి కూలీగా చెప్పుకుంటూ కాటేదాన్ ప్రాంతంలో ఓ చిన్న గది అద్దెకు తీసుకున్నాడు. 19వ తేదీన లంగర్హౌజ్ పరిధిలో ఓ బైక్ చోరీ చేశాడు. దానిపై తిరుగుతూ రెక్కీ చేసిన ఇతగాడు ఆదివారం రంగంలోకి దిగాడు.
కాచిగూడ, ఎస్సార్ నగర్ పరిధిల్లో రెండు స్నాచింగ్స్ చేశాడు. దీనిపై స్థానిక పోలీసుస్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. రంగంలోకి దిగిన పోలీసులు…వలపన్ని పట్టుకున్నారు. మరి ఈ సారైనా..బుద్ధి మార్చుకుంటాడా..లేదా…గతంలోలాగే జైల్లోనే మరో ప్లాన్ వేసి…చోరీలకు పాల్పడతాడా..అనేది ప్రశ్నార్థకంగా మారింది.