india have 200 300 mn covid vaccine : ప్రపంచ వ్యాప్తంగా ఇంకా కరోనా విజృంభిస్తూనే ఉంది. భారతదేశంలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలు వ్యాక్సిన్ రూపొందించే పనిలో ఉన్నాయి. అయితే..ఎప్పట వరకు వ్యాక్సిన్ వస్తుందనే దానిపై క్లారిటీ రావడం లేదు.
తాజాగా..దీనిపై పుణేలోని ప్రముఖ ఫార్మా సంస్థ సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ ఏడాది డిసెంబర్ ఆఖరు నాటికి దాదాపు 30 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులు సిద్ధమవుతాయని సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ సురేశ్ జాదవ్ వెల్లడించారు. డీసీజీఐ నుంచి లైసెన్స్ రాగానే ఈ వ్యాక్సిన్ డోసులు ప్రజలకు అందుతాయని పేర్కొన్నారు.
చివరి పరీక్ష జరుపుకున్న వ్యాక్సిన్ 2021 మార్చిలో అందుబాటులోకి వస్తుందన్నారు. అన్ని అనుమతులు పొందాకే వ్యాక్సిన్ను విక్రయిస్తామన్నారు. తాము నెలకు దాదాపు 7 కోట్ల వ్యాక్సిన్ డోసులను ఉత్పత్తి చేస్తామన్నారు. సీరమ్ సంస్థ ఐదు రకాల వ్యాక్సిన్లతో ప్రయోగాలు చేస్తోంది.
మరోవైపు.. రష్యా అభివృద్ధి చేసిన స్పుత్నిక్–వీ వ్యాక్సిన్ రెండు/మూడో దశ హ్యూమన్ క్లినికల్ ట్రయల్స్ను భారత్లో నిర్వహించేందుకు తమకు డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ) నుంచి అనుమతి లభించిందని డాక్టర్ రెడ్డీస్ ల్యాబోరేటరీస్ శనివారం ఓ ప్రకటనలో తెలిపింది.
భారత్లో హ్యూమన్ క్లినికల్ ట్రయల్స్ చేపట్టేందుకు, వ్యాక్సిన్ను పంపిణీ చేసేందుకు డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్, రష్యాకు చెందిన ఆర్డీఐఎఫ్ గత నెలలో చేతులు కలిపిన సంగతి తెలిసిందే. ఒప్పందంలో భాగంగా ఆర్డీఐఎఫ్ డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్కు 10 కోట్ల్ల కరోనా వ్యాక్సిన్ డోసులను అందజేయనుంది.
ఇక ఇదిలా ఉంటే..భారతదేశంలో..గత 24 గంటల్లో 62 వేల 212 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 74,32,680కు చేరుకుందని, అదే సమయంలో 837 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 1,12,998 కు చేరుకుందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.
రికవరీ కేసులు కూడా పెరుగుతున్నట్లు, 65,24,595కు చేరుకోగా, యాక్టివ్ కేసుల సంఖ్య 7,95,087గా ఉంది. దాదాపు నెలన్నర తర్వాత తర్వాత యాక్టివ్ కేసుల సంఖ్య 8 లక్షల దిగువకు వచ్చింది. మొత్తం కరోనా కేసుల్లో యాక్టివ్ కేసులు 10.70 శాతం ఉన్నాయి. దేశంలో కరోనా రికవరీ రేటు క్రమంగా పెరుగుతోందని తెలిపింది.