Uday Kotak : కరోనా సంక్షోభంతో దెబ్బతిన్న భారత ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టేందుకు చర్యలు తీసుకోవాలని భారత పారిశ్రామిక సమాఖ్య(సీఐఐ) ప్రెసిడెంట్ ఉదయ్ కొటక్ అభిప్రాయపడ్డాడు. ఆర్థిక వ్యవస్థను గట్టెక్కించేందుకు అదనపు మనీ ప్రింట్ చేయాలన్నారు. కరోనాతో ఆర్థిక వ్యవస్థ కొట్టుమిట్టాడుతున్న ఈ సమయంలో కాకుండా ఇంకెప్పుడు అదనపు డబ్బు ప్రింట్ చేస్తారని ప్రశ్నించారు.
కరోనాను ఎదుర్కోవడానికి గతేడాది కేంద్రం ఆత్మ నిర్భర్ భారత్ ప్యాకేజీ కింద 3లక్షల కోట్లు ప్రకటించింది. అయితే, ఈ ఏడాది కూడా ఆ పథకాన్ని 3 నుంచి 5లక్షల కోట్ల వరకు విస్తరించాలని ఉదయ్ కొటక్ సిఫార్సు చేశారు. దిగువ మధ్య తరగతి సమాజాన్ని, చిన్న తరహా పరిశ్రమలకు చేయూత ఇవ్వడానికి సహాయ ప్యాకేజీలు ప్రకటించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు ఉదయ్ కొటక్.
చిన్న పరిశ్రమలకు హామీ రహిత రుణాలకు సంబంధించిన క్రెడిట్ గ్యారెంటీ స్కీమ్ కింద ఇచ్చే పరిమాణాన్ని రూ.3 లక్షల కోట్ల నుంచి రూ.5 లక్షల కోట్లకు పెంచే విషయాన్ని పరిశీలించాలన్నారు.