India Corona : దేశంలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు, మరణాలు
దేశంలో కరోనా తీవ్రత కొనసాగుతోంది. మళ్లీ కొత్త కేసులు, మరణాలు పెరిగాయి. రెండు రోజులు క్రితం కాస్త తగ్గినట్లే కన్పించిన మహమ్మారి మళ్లీ విరుచుకుపడుతోంది. వరుసగా రెండో రోజు మరణాలు ఆందోళనకర రీతిలో 4వేల పైనే నమోదయ్యాయి. 24 గంటల వ్యవధిలో 4వేల 120 మందిని వైరస్ పొట్టనబెట్టుకుంది. ఇక కొత్త కేసులు 4లక్షలకు దిగువనే ఉన్నప్పటికీ క్రితం రోజు కంటే స్వల్పంగా పెరగడం ఆందోళన కలిగిస్తోంది.
- Naveen
- Published On : May 13, 2021 / 10:30 AM IST
India Reports Again Record Corona Cases
India Corona : దేశంలో కరోనా తీవ్రత కొనసాగుతోంది. మళ్లీ కొత్త కేసులు, మరణాలు పెరిగాయి. రెండు రోజులు క్రితం కాస్త తగ్గినట్లే కన్పించిన మహమ్మారి మళ్లీ విరుచుకుపడుతోంది. వరుసగా రెండో రోజు మరణాలు ఆందోళనకర రీతిలో 4వేల పైనే నమోదయ్యాయి. 24 గంటల వ్యవధిలో 4వేల 120 మందిని వైరస్ పొట్టనబెట్టుకుంది. ఇక కొత్త కేసులు 4లక్షలకు దిగువనే ఉన్నప్పటికీ క్రితం రోజు కంటే స్వల్పంగా పెరగడం ఆందోళన కలిగిస్తోంది.
బుధవారం (మే 12,2021) ఉదయం 8 గంటల నుంచి గురువారం(మే 13,2021) ఉదయం 8 గంటల వరకు దేశవ్యాప్తంగా 18.64లక్షల మందికి కరోనా పరీక్షలు చేయగా 3లక్షల 62వేల 727 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. అంతక్రితం రోజుతో పోలిస్తే దాదాపు 15వేలు ఎక్కువ. తాజా కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్ల సంఖ్య 2.37కోట్లకు చేరింది. మరో 4వేల 120 మంది వైరస్ సోకి ప్రాణాలు కోల్పోయారు. మహమ్మారి దేశంలోకి ప్రవేశించినప్పటి నుంచి ఇప్పటివరకు 2లక్షల 58వేల 317 మందిని బలితీసుకుంది. మరణాల రేటు 1.09శాతంగా ఉంది.
కాగా, కొత్త కేసులతో పాటు రికవరీలు కూడా భారీగా ఉంటుండటం కాస్త సానుకూలాంశం. 24 గంటల్లో మరో 3లక్షల 52వేల 181 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు 1.97కోట్ల మంది కరోనాను జయించారు. రికవరీ రేటు 83.26శాతానికి చేరింది. మరోవైపు బుధవారం నాటితో పోలిస్తే దేశంలో యాక్టివ్ కేసులు స్వల్పంగా 6వేలు పెరిగాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 37,10,525 మంది వైరస్కు చికిత్స తీసుకుంటున్నారు. యాక్టివ్ కేసుల రేటు 15.65శాతంగా ఉంది.
