Indian in Ukraine: పెంపుడు కుక్క కోసం యుద్ధభూమిలోనే ఉండిపోయిన భారతీయుడు
భారతీయులను సురక్షితంగా స్వదేశానికి తరలించేలా భారత ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. కుక్కను వదిలి వెళ్లడానికి మనసొప్పక.. రిషబ్ మాత్రం యుక్రెయిన్ లోనే ఉండిపోయాడు.
- Bharath Reddy
- Published On : February 26, 2022 / 05:54 PM IST
Dog
Indian in Ukraine: రష్యా యుక్రెయిన్ మధ్య భీకరమైన యుద్ధం జరుగుతుంది. నిముషల వ్యవధిలో పరిణామాలు మారిపోతున్నాయి. యుక్రెయిన్లోకి చొచ్చుకొచ్చిన రష్యా సైనికులు.. నగరాలలోని ప్రజలపైనా దాడులకు తెగబడుతున్నారు. దీంతో ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని యుక్రెయిన్ పౌరులు, అక్కడ నివసిస్తున్న ఇతర దేశస్తులు కట్టుబట్టలతో సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లిపోతున్నారు. ఇక యుక్రెయిన్ లో చిక్కుకున్న భారతీయులను తరలించేందుకు భారత ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. ప్రత్యేక విమానాల్లో భారతీయులను సురక్షితంగా స్వదేశానికి తరలించేలా భారత ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. అయితే ఒక భారతీయ యువకుడు మాత్రం యుక్రెయిన్ నుంచి తాను రాలేనంటూ అక్కడే ఉండిపోయాడు. తన పెంపుడు కుక్కను వదిలి తాను రాలేనని, కుదిరితే దాన్ని కూడా వెంటబెట్టుకొచ్చేలా అధికారులను ఒప్పించి అక్కడి నుంచి కదులుతానని ఆ యువకుడు పట్టుబట్టాడు.
Also read: UN Security Council : యుఎన్ భద్రతా మండలి అంటే ఏంటి? యుక్రెయిన్పై రష్యా దాడిని ఎలా అడ్డుకోగలదు?
ఉత్తరాఖండ్ కు చెందిన రిషబ్ కౌశిక్ అనే యువకుడు యుక్రెయిన్ లోని ఖార్కివ్ లో ఇంజనీరింగ్ చదువుతున్నాడు. అతని కుటుంబ సభ్యులు సైతం వ్యాపారం నిమిత్తం యుక్రెయిన్ లోనే ఉంటున్నారు. ఈక్రమంలో ఖార్కివ్ లో ఓ శునకాన్ని చేరదీశాడు రిషబ్. ఆ కుక్క అంటే రిషబ్ కు ఎంతో ఇష్టం. అయితే యుద్ధం కారణంగా ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలంటూ అక్కడి అధికారులు సూచించగా.. రిషబ్ కుటుంబ సభ్యులు ఇటీవల దుబాయ్ చేరుకున్నారు. కాగా కుక్కను వదిలి వెళ్లడానికి మనసొప్పక.. రిషబ్ మాత్రం యుక్రెయిన్ లోనే ఉండిపోయాడు. ఇంతకాలం ప్రేమగా చూసుకున్న కుక్కను వదిలి వెళితే అది ఏమైపోతుందోనన్న బాధతో.. దాన్ని కూడా తనతోపాటే తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తానని.. లేనిపక్షంలో స్థానిక “డాగ్ షెల్టర్”కు అప్పగించి వస్తానని రిషబ్ పేర్కొన్నాడు.
Also read: Conman cheat Woman: యుక్రెయిన్ లో చిక్కుకున్న విద్యార్థినిని రప్పిస్తానంటూ మహిళను మోసం చేసిన వ్యక్తి
