India’s first smog tower inaugurated in Delhi : భారతదేశంలోనే మొట్టమొదటి స్మాగ్ టవర్ (Smog Tower) అందుబాటులోకి వచ్చేసింది. దేశ రాజధాని ఢిల్లీలో ఈ స్మాగ్ టవర్ను సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రారంభించారు. ఢిల్లీలో భారీగా వాయు కాలుష్యం పెరిగిపోయింది. వాయు కాలుష్యాన్ని నివారించేందుకు ఎప్పటినుంచో ఢిల్లీ ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోంది. గాల్లోని వాయు కాలుష్యాన్ని నిరోధించేందుకు ఈ స్మాగ్ టవర్ ఏర్పాటు చేశారు. 2020 ఏడాది అక్టోబర్ నెలలోనే పైలట్ ప్రాజెక్టుగా ఈ టవర్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావించింది. అయితే కరోనావైరస్ వ్యాప్తితో టవర్ పనులన్నీ నిలిచిపోయాయి. ఇప్పుడు ఈ స్మాగ్ టవర్ ప్రారంభమైంది. అలాగే ఇక్కడ కంట్రోల్ రూం కూడా ఏర్పాటు చేశారు.
ఢిల్లీలో Connaught Place దగ్గర మొట్టమొదటి ఈ స్మాగ్ టవర్ నిర్మించారు. ఇక్కడి పరిసర ప్రాంతాల్లో కిలోమీటర్ వ్యాసార్థం వరకు 1,000 క్యూబిక్ మీటర్ల గాలిని సెకన్ల వ్యవధిలో ఫిల్టర్ చేసేస్తుంది. ఈ స్మోగ్ టవర్ పనితీరుపై రెండేళ్ల పాటు అధ్యయనం చేయనున్నారు. మిగిలిన ప్రాంతాల్లో కూడా ఈ స్మాగ్ టవర్లను ఏర్పాటు చేయనున్నారు. ఈ టవర్ ప్రారంభించిన అనంతరం కేజ్రీవాల్ మీడియాతో మాట్లాడారు. వాయు కాలుష్యంపై పోరాటంలో భాగంగా గాలిని శుభ్రం చేసేందుకు ఈ స్మోగ్ టవర్ ఏర్పాటు చేసినట్టు చెప్పారు. ఈ టెక్నాలజీని అమెరికా నుంచి దిగుమతి చేసుకున్నట్లు పేర్కొన్నారు.
ఈ టవర్ 24 మీటర్ల ఎత్తులో ఉంటుంది. కిలోమీటర్ వ్యాసార్థంలోని గాలిని ఫీల్టర్ చేస్తుంది. పొగమంచు టవర్ కలుషితమైన గాలిని లోపలికి పీల్చుకుంటుంది. అలాగే స్వచ్ఛమైన గాలిని 10 మీటర్ల ఎత్తులో విడుదల చేస్తుంది. తద్వారా ఢిల్లీలో వాయు కాలుష్యం ప్రభావాన్ని నిపుణులు పరిశీలిస్తుంటారు. ఢిల్లీలోని ఇతర ప్రదేశాల్లో కూడా ఈ డివైజ్లను ఇన్స్టాల్ చేయనున్నారు. కాలుష్యం తగ్గించేందుకు ఆనంద్ విహార్ వద్ద స్మాగ్ టవర్ నిర్మాణానికి చర్యలు తీసుకోవాలంటూ గత ఏడాది జనవరిలోనే కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. 3 నెలల్లోనే కన్నాట్ ప్లేస్లో టవర్ను ఏర్పాటు చేయాల్సిందిగా ఢిల్లీ ప్రభుత్వాన్ని ఆదేశించింది.
ఎయిర్ పొల్యూషన్ కు చెక్…ఢిల్లీలో “స్మాగ్ టవర్”