PM Modi (Image Credit To Original Source)
PM Modi: బీజేపీ అమలుచేసే అభివృద్ధి విధానాలపై భారత్లోని జెన్ జీకి నమ్మకం ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం సాధించిన విషయాన్ని గుర్తుచేస్తూ ఆయన ఈ వ్యాఖ్య చేశారు.
పశ్చిమ బెంగాల్లో కొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉన్న నేపథ్యంలో ఇవాళ ఆ రాష్ట్రంలో మోదీ పర్యటించారు. మొట్టమొదటి వందే భారత్ స్లీపర్ రైలును ఆ రాష్ట్రంలోని మాల్దా టౌన్ రైల్వే స్టేషన్ నుంచి పచ్చజెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మోదీ మాట్లాడారు.
Also Read: ఇక సంగారెడ్డిలో ఎమ్మెల్యేగా నా జీవితంలో పోటీ చేయను.. ఎందుకంటే..?: జగ్గారెడ్డి
పశ్చిమ బెంగాల్లో ప్రభుత్వం మారాల్సిన అవసరం ఉందని మోదీ అన్నారు. “పశ్చిమ బెంగాల్లోని దయలేని, క్రూరమైన తృణమూల్ సర్కారు ప్రజల సొమ్మును దోచుకుంటోంది.
బెంగాల్లోని ప్రజలకు కేంద్ర ప్రభుత్వం నుంచి సాయం అందకుండా అడ్డుకుంటోంది. పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ ఓడిపోయి, బీజేపీ అధికారంలోకి వస్తేనే రాష్ట్రంలో అభివృద్ధి సాధ్యమవుతుంది” అని చెప్పారు.
బెంగాల్లో బీజేపీ అధికారంలోకి వచ్చాక చొరబాటుదారులకు వ్యతిరేకంగా కఠిన చర్యలు తీసుకుంటామని మోదీ తెలిపారు. మతువా, హింసకు గురై పొరుగు దేశాల నుంచి వచ్చిన శరణార్థులు మాత్రం భయపడాల్సిన అవసరం లేదని, వారిని పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) కాపాడుతుందని భరోసా ఇచ్చారు.