Iran vs Israel War
Iran vs Israel War : ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దాడుల ప్రభావం భారతదేశంలో నిత్యావసర వస్తువుల ధరలపై పడుతుంది. యుద్ధం కారణంగా ఇప్పటికే పెట్రోల్, డీజిల్తోపాటు వంట నూనెల ధరలు పెరిగాయి. మరికొన్ని నిత్యావసర వస్తువుల ధరలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతేకాక.. గ్యాస్ ధరలపైనా యుద్ధం ప్రభావం పడింది.
ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య వార్ ఇలాగే కొనసాగితే రానున్న రోజుల్లో గ్యాస్ ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. యుద్ధం కారణంగా లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ (ఎల్ఎన్జీ) సరఫరా భారీగా తగ్గింది. వాస్తవానికి.. భారత ప్రభుత్వం గ్యాస్ అవసరాలకోసం పూర్తిగా మిడిల్ ఈస్ట్ దేశాలపై ఆధారపడుతుంది. ప్రస్తుతం ఇరాన్- అమెరికా యుద్దం కారణంగా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉండడంతో ఇతర దేశాలతో సంప్రదింపులు మొదలు పెట్టింది.
ఓవైపు సరఫరాలో కోత పడగా మరోవైపు స్పాట్ మార్కెట్లో కూడా దొరికే పరిస్థితి లేకపోవడంతో ప్రాధాన్యత రంగాలపై ప్రతికూల ప్రభావం పడుతోందని గ్యాస్ సరఫరా దిగ్గజం గెయిల్ సీఎండీకీ సీజీడీ సంస్థల సమాఖ్య ఏసీఈ లేఖ రాసింది. గృహాలు, సీఎన్జీ కస్టమర్లు, చిన్న పరిశ్రమలకు నిరాటంకంగా గ్యాస్ సరఫరా చేసేందుకు తాము కట్టుబడి ఉన్నామని, కాకపోతే గ్యాస్ లభ్యతపై స్పష్టతనివ్వాలని కోరింది.
ప్రస్తుతం ఇండియా రోజుకు 195 మిలియన్ మెట్రిక్ స్టాండర్డ్ క్యూబిక్ మీటర్స్ పర్ డే0 (ఎంఎంఎస్సీఎండీ) గ్యాస్ దిగుమతి చేసుకుంటుంది. ఇందులో 60 మిలియన్ ఎంఎంఎస్సీఎండీ ఖతర్ నుంచి వస్తోంది. ఒక్క ఖతర్ నుండే 40శాతం గ్యాస్ సరఫరా అవుతోంది. ఇరాన్ దాడులు చేయడంతో ఖతర్ ఎనర్జీకి చెందిన ఎల్ఎన్జీ కేంద్రాల్లో ఉత్పత్తి ఆగిపోయింది. ఈ కంపెనీ ఫోర్స్ మెజర్ నోటీసులు జారీ చేసింది. అంటే ఒప్పందం ప్రకారం.. గ్యాస్ సప్లయ్ చేయలేమని చేతులెత్తేసింది. ఇలాంటి సమయంలో ఇతర దేశాల నుంచి గ్యాస్ కొనడం అనివార్యమైంది.
ఖతర్ చేతులెత్తేయడంతో ప్రత్యామ్నాయ వనరులపై భారత దేశం దృష్టి సారించింది. ఇప్పటికే ఆస్ట్రేలియా, కెనడా దేశాలు భారత్కు గ్యాస్ సరఫరా చేయడానికి ముందుకు వచ్చాయి. అలాగే కొత్త ఒప్పందాల ద్వారా యూఏఈ, అమెరికా నుంచి కూడా ఇంధన వనరులు భారత్ సమీకరిస్తోంది. అయితే, ప్రస్తుతం గ్యాస్ కొరత లేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.