Jio 5G Launch: రేపే జియో 5జీ సేవలు ప్రారంభం.. ఈ నాలుగు నగరాల్లో ట్రయల్ రన్.. అన్లిమిటెడ్ డాటా
దేశంలో 5జీ సేవలు రేపే ప్రారంభం కాబోతున్నాయి. దసరా సందర్భంగా బుధవారం నుంచి 5జీ సేవలు అందుబాటులోకి వస్తాయి. మొదటగా దేశంలోని నాలుగు నగరాల్లో ఈ సేవలు ప్రారంభమవుతాయి.
- Narender Thiru
- Published On : October 4, 2022 / 06:49 PM IST
Jio 5G Launch: రిలయన్స్ జియో సంస్థ బుధవారం దేశంలో మొదటిసారిగా 5జీ సేవలు ప్రారంభించబోతుంది. దసరా పండుగను పురస్కరించుకుని దేశంలోని నాలుగు పట్టణాల్లో 5జీ సేవల్ని ప్రయోగాత్మకంగా ప్రారంభించనుంది.
ముంబై, కోల్కతా, ఢిల్లీ, వారణాసి పట్టణాల్లో ఈ సేవలు ప్రారంభమవుతాయి. ఇది ప్రత్యేక ఆఫర్ అని, దీని కింద వినియోగదారులకు 1జీబీపీఎస్ స్పీడుతో అన్ లిమిటెడ్ డాటా అందించనున్నట్లు జియో సంస్థ తెలిపింది. మిగతా నగరాల్లో కూడా ప్రయోగాత్మకంగా 5జీ సేవలు త్వరలోనే ప్రారంభమవుతాయని కంపెనీ ప్రకటించింది. ‘జియో ట్రూ 5జీ’ సేవలు పొందేందుకు కస్టమర్లు సిమ్ కార్డు, 5జీ మొబైల్ మార్చాల్సిన అవసరం లేదని, కస్టమర్లకు ఆటోమేటిగ్గా సర్వీస్ అప్గ్రేడ్ అవుతుందని జియో చెప్పింది.
5జీ సేవలు అందరికీ అందుబాటులో ఉంటాయని, ప్రతి వ్యక్తికి, ప్రతి ఇంటికి, అన్ని రకాల వారికి అందుబాటులో ఉంటాయని జియో సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం జియో సంస్థకు 42.5 కోట్ల కస్టమర్లు ఉన్నారు. తాము ప్రారంభించనున్న 5జీ సేవల ద్వారా దేశంలో హెల్త్ కేర్, స్కిల్ డెవలప్మెంట్, ఎడ్యుకేషన్, అగ్రికల్చర్ వంటి అనేక రంగాలు మరింత ప్రగతి సాధిస్తాయని అంబానీ అన్నారు.
