Rawat
Uttarakhand Election : వచ్చే ఏడాది ప్రారంభంలో ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న వేళ రెండు రోజుల క్రితం కాంగ్రెస్ అధినాయకత్వం తీరుపై ఆ పార్టీ సీనియర్ నేత,మాజీ సీఎం హరీష్ రావత్ ట్విట్టర్ వేదికగా తీవ్ర విమర్శలు చేసి సంచలనానికి తెరలేపిన విషయం తెలిసిందే. అయితే ఇవాళ రాష్ట్ర నేతలతో కలిసి ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో భేటీ అయిన అనంతరం హరీశ్ రావత్ స్వరం మారింది. ఎన్నికల ప్రచార కమిటీకి తానే సారథ్యం వహించేలా అధిష్ఠానాన్ని ఒప్పించడంలో రావత్ సక్సెస్ అయ్యారు.
రాహుల్ భేటీ అనంతరం ఐక్యతా రాగం ఆలపించారు రావత్.”కలిసి ముందుకు సాగుతాం. కాంగ్రెస్ను విజయ తీరాలకు చేర్చుతాం. నా నేతృత్వంలోనే ఉత్తరాఖండ్ ఎన్నికలు జరుగుతాయి” అని హరీష్ రావత్ పేర్కొన్నారు. అయితే పార్టీపై అసంతృప్తి పూర్తిగా తొలగిపోయిందా అని ఓ విలేఖరి అడిగిన ప్రశ్నకు.. అంచెలంచెలుగా జరుగుతుందని రావత్ సమాధానమిచ్చారు.
ముఖ్యమంత్రి అభ్యర్థి ప్రకటనపై రావత్ ను ప్రశ్నించగా..ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎన్నుకోవటంపై అధ్యక్షుడికి ప్రత్యేక అధికారం ఉందని రావత్ తెలిపారు. ఎన్నికల అనంతరం శాసనసభాపక్ష సమావేశం నిర్వహించి ఎమ్మెల్యేలంతా తమ నాయకుడిని ఎన్నుకుంటారని పేర్కొన్నారు. రావత్ తాజా వ్యాఖ్యలతో పార్టీ నాయకత్వంతో ఉన్న విభేదాలు సమసిపోయినట్లే కనిపిస్తోంది.
ALSO READ Uttarakhand Election : హైకమాండ్ పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ ట్రబుల్ షూటర్