Ashwattha Narayana
BJP Minister Ashwattha Comments : కర్ణాటక బీజేపీ మంత్రి అశ్వత్థ నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ సీఎం, కాంగ్రెస్ నేత సిద్ధరామయ్యను చంపేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మంగళవారం ఓ సభలో మంత్రి అశ్వత్థ నారాయణ హత్యా రాజకీయాలను ప్రేరేపించేలా ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘టిప్పు సుల్తాన్ ను హత మార్చినట్లు సిద్ధరామయ్యను కూడా హత మార్చాలి’ అంటూ వ్యాఖ్యానించారు. ‘నాడు టిప్పు సుల్తాన్ ను హురిగౌడ, నంజేగౌడ ఏ విధంగానైతే పైకి పంపారో.. అదే విధంగా చేయాలి’ అని పేర్కొన్నారు.
మంత్రి అశ్వత్థ నారాయణపై వ్యాఖ్యలపై సిద్ధరామయ్య స్పందించారు. మహాత్మగాంధీని హత్య చేసిన వ్యక్తిని ఆరాధించే పార్టీ నేతలకు ఇలాంటి మాటలే వస్తాయని అన్నారు. ఇలాంటి నేతలే ప్రజాస్వామ్య మనుగడకు ముప్పు అని పేర్కొన్నారు. గవర్నర్ జోక్యం చేసుకుని అశ్వత్థ నారాయణను మంత్రి పదవి నుంచి తొలగించాలని కోరారు.
మరోవైపు మంత్రి అశ్వత్థ నారాయణను అరెస్టు చేయాలని కాంగ్రెస్ ఆందోళన చేపట్టింది. తన వ్యాఖ్యలపై దుమారం రేగడంతో అశ్వత్థ స్పందించారు. రాజకీయంగా అంతం చేయాలనే అర్థంలోనే అలా మాట్లాడానని చెప్పారు. సిద్ధరామయ్యపై అశ్వత్థ నారాయణ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. గతంలో కూడా పలువురు బీజేపీ నేతలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.