Nitin Gadkari: పాఠ్య పుస్తకాల్లో సావర్కర్ పాఠ్యాంశాన్ని తొలగించిన కర్ణాటక ప్రభుత్వం.. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కీలక వ్యాఖ్యలు
కెబి హెడ్డేవార్, సావర్కర్లకు సంబంధించిన పాఠ్యాంశాలను తొలగించేందుకు ప్రతిపాదనను కర్ణాటక ప్రభుత్వం గురువారం ఆమోదించింది.
- Harishth Thanniru
- Published On : June 18, 2023 / 09:30 AM IST
Nitin Gadkari
Nitin Gadkari- Savarkar: కర్ణాటక ( Karnataka) రాష్ట్రంలోని సిద్ధరామయ్య (Siddaramaiah) ప్రభుత్వం ఈ విద్యా సంవత్సరానికి ఆరు నుంచి పదో తరగతి సాంఘీక శాస్త్రం పాఠ్యపుస్తకాల్లో ఉన్న ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకుడు కెబి హెడ్డేవార్ (KB Heddewar) , హిందుత్వ సిద్ధాంతకర్త వీడి సావర్కర్ల (VD Savarkar) చరిత్రను పాఠ్యాంశాల నుంచి తొలగించింది. కర్ణాటక ప్రభుత్వం తీరుపట్ల కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ (Nitin Gadkari) కీలక వ్యాఖ్యలు చేశారు. డాక్టర్ హెడ్డేవార్, వీడి సావర్కర్ ల అధ్యాయాలను తొలగించడం చాలా దురదృష్టకరమని అన్నారు.
Karnataka: ఆర్ఎస్ఎస్ పాఠాలు తొలగించి అంబేద్కర్ పాఠాలు తిరిగి ప్రవేశపెట్టిన కర్ణాటక ప్రభుత్వం
నాగ్పూర్లో విడి సావర్కర్ పై పుస్తకాన్ని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హిందుత్వం అంటే అందరినీ కలుపుకుపోయేదని సావర్కర్ చెప్పారని అన్నారు. ఇది కులతత్వం, మతతత్వం లేనిది. సావర్కర్ ఒక సంఘ సంస్కర్త. ఆయన మనకు ఆదర్శం. పాఠశాల పాఠ్యాంశాల నుంచి హెడ్డేవార్, సావర్కర్ అధ్యాయాన్ని తొలగించడం దురదృష్టకరం. అంతకంటే దురదృష్టకరం మరొకటి లేదని అన్నారు. సావర్కర్, వివేకానందలు ప్రచారం చేసిన భారతీయ, హిందూ సంస్కృతి ఒకటేనని. వారి భావజాలం, దేశంకోసం సావర్కర్ చేసిన త్యాగాల గురించి యువతరానికి అవగాహన కల్పించాలని గడ్కరీ అన్నారు.
కెబి హెడ్డేవార్, సావర్కర్లకు సంబంధించిన పాఠ్యాంశాలను తొలగించేందుకు ప్రతిపాదనను కర్ణాటక ప్రభుత్వం గురువారం ఆమోదించింది. గతంలో కర్ణాటక విద్యాశాఖ మంత్రి మధు బంగారప్ప కూడా వాటికి సంబంధించిన చాప్టర్లను తొలగిస్తున్నట్లు ప్రకటించారు.
