Karnataka : కర్ణాటక సర్కార్ సంచలన నిర్ణయం.. ఉమ్మెత్త పండ్ల ఎఫెక్ట్.. అమెజాన్, స్విగ్గీ, బిగ్బాస్కెట్లకు బిగ్షాక్..
Karnataka Government Sensational Decision on Datura Fruit Sales : కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజాలైన అమెజాన్, స్విగ్గీ ఇన్స్టామార్ట్, బిగ్బాస్కెట్లకు షాకిచ్చింది.
- Harish Thanniru
- Updated on- August 25, 2026 / 12:25 PM IST
Karnataka Government Sensational Decision on Datura Fruit Sales
Karnataka Government Sensational Decision on Datura Fruit Sales : కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజాలైన అమెజాన్, స్విగ్గీ ఇన్స్టామార్ట్, బిగ్బాస్కెట్లకు షాకిచ్చింది. వాటి ఆహార లైసెన్సులు, రిజిస్ట్రేషన్లను తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు రద్దుచేస్తూ రాష్ట్ర ఆహార భద్రత, ఔషద పరిపాలన విభాగం సంచలన నిర్ణయం తీసుకుంది.
ఆహార భద్రత అధికారులు జరిపిన సమగ్ర దర్యాప్తులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. తీవ్ర విషపూరిత స్వభావాన్ని కలిగినటువంటి ఉమ్మెత్త పండ్లు, వాటి విత్తనాలను విక్రేతలు ఎఫ్ఎస్ఎస్ఏఐ (FSSAI) రిజిస్ట్రేషన్, లైసెన్స్ నంబర్లను ఉపయోగించి మరీ ప్యాక్ చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. వీటిని గిడ్డంగుల్లో నిల్వ ఉంచి, వివిధ ఈ-కామర్స్ యాప్ ల ద్వారా వినియోగదారులకు నేరుగా డెలివరీ చేస్తున్నట్లు అధికారుల దర్యాప్తులో తేలింది.
అధికారుల వివరాల ప్రకారం.. ఉమ్మెత్త పండ్లు, విత్తనాలు అత్యంత విషపూరితమైనవి. వాటిని మానవులు తీసుకోవటం వల్ల తీవ్రమైన అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. ఈ కారణంగా ఆన్లైన్ ప్లాట్ఫామ్లలో వాటిని ఆహార ఉత్పత్తులుగా విక్రయించడాన్ని కర్ణాటక ఫుడ్ సేఫ్టీ అధికారులు నిషేధించారు.
ఉమ్మెత్త పండ్లు, విత్తనాలను ఆహారంగా లేదా మానవ వినియోగం కోసం అందించే అన్ని ఆన్లైన్ లిస్టింగ్లు ప్రకటనలను వెంటనే తొలగించాలని సంబంధిత ఫుడ్ బిజినెస్ ఆపరేటర్లను కర్ణాటక అధికారులు ఆదేశించారు. భవిష్యత్తులో వాటిని ఆహార ఉత్పత్తులుగా విక్రయించినా లేదంటే పంపిణీ చేసినా కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. అయితే, ఈ లైసెన్స్ సస్పెన్షన్ శాశ్వతం కాదని.. కంపెనీలు తమ వివరణ రిపోర్టులు సమర్పించిన తరువాత విచారణ నిర్వహించి తదుపరి నిర్ణయం తీసుకుంటామని అధికారులు తెలిపారు. అయితే, ఇప్పటికే పలు ఆన్లైన్ ప్లాట్ఫామ్లు తమ వివరణను అధికారులకు సమర్పించినట్లు తెలిసింది.
