స్కూలు రోజుల్లోనో, కాలేజీ రోజుల్లోనో పరీక్షల్లో కాపీ కొట్టి పరీక్ష రాయటం అనేది కొందరు విద్యార్దులు సాధారణంగా చేసే పని. అది స్లిప్పు పెట్టి రాయొచ్చు, లేదా తన చుట్టు పక్కల ఉన్న విద్యార్ధుల జవాబు పత్రం చూసి కూడా రాయొచ్చు. అప్పటి పరిస్ధితిని, అవసరాన్ని బట్టి విద్యార్దులు అవకాశాన్ని వినియోగించుకుంటారు. విద్యార్ధులు అలాంటి మాల్ ప్రాక్టీస్ ఏమీ చేయకుండా ఉండటానికే పరీక్ష హాల్లో ఇన్విజిలేటర్ ఉండి పర్యవేక్షిస్తూ ఉంటారు. కానీ కర్ణాటకలోని హవేరి జిల్లాలో ఓకాలేజీ యాజమాన్యం విద్యార్థులు పరీక్షల్లో కాపీ కొట్టకుండా ఉండేందుకు ‘వినూత్న’ విధానాన్ని అవలంభించటంతో సర్వత్రా విమర్శలు తలెత్తుతున్నాయి.
కర్ణాటకలోని హవేరీ పట్టణంలో గల భగత్ ప్రీ-యూనివర్సిటీ కాలేజీలో పరీక్షలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా విద్యార్థులు ఒకరి పేపర్లలో ఒకరు చూసి రాయకుండా ఉండేందుకు లెక్చరర్లు వారి తలపై అట్టెపెట్టెలు బోర్లించారు. అంతేగాకుండా పెట్టె పక్కకు పోయిన ప్రతిసారీ ఇన్విజిలేటర్ వచ్చి విద్యార్థులను హెచ్చరిస్తూ వాటిని సరిచేశారు. కాగా ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కాలేజీ యాజమాన్యంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే కొంతమంది విద్యార్థులకు మాత్రం అట్టపెట్టెల నుంచి లెక్చరర్లు మినహాయింపు ఇచ్చారు. విద్యార్థులు కూడా మనుషులేనని… వారిని జంతువుల్లా భావించడం సరికాదంటూ పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ విషయం మొత్తానికి కర్ణాటక విద్యాశాఖ మంత్రి సురేశ్ కుమార్కి చేరింది. దీంతో ఆయన కాస్త ఫైర్ అయ్యారు. ‘విద్యార్థుల పట్ల ఉపాధ్యాయులు ప్రవర్తించిన తీరు ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదు. విద్యార్థులను జంతువుల్లా ట్రీట్ చేసే హక్కు ఎవరికీ లేదు. ఈ విషయంపై కఠిన చర్యలు ఉంటాయి’అని ట్వీట్ చేశారు. విషయం తెలిసి కాలేజీ వద్దకు వెళ్లిన పోలీసులు విద్యార్ధుల తలపై ఉన్న అట్టపెట్టెలు తొలగించి కాలేజీ యాజమాన్యాన్ని హెచ్చరించి వచ్చారు. ఇకపై ఇలాంటివి పునరావృతమైతే కఠిన చర్యలు తప్పవని… ఇటువంటి విషయాల్లో విద్యార్థులు చెప్పినట్లు వినాల్సిన పనిలేదని పోలీసులు హెచ్చరించారు. అయితే కాలేజీ యాజమాన్యం మాత్రం తాము చేసిన పనిని సమర్థించుకోవడం విశేషం. కాలేజీ హెడ్ సతీశ్ మాట్లాడుతూ.. బిహార్లో కూడా ఇటువంటి విధానం అనుసరించారని.. తాము చేసిన దాంట్లో తప్పేమీ లేదని చెప్పుకొచ్చారు. విద్యార్థులు పక్క చూపులు చూడకుండా ఇదో సరికొత్త ప్రయోగం అని అన్నారు.
This is totally unacceptable. Nobody has any right to treat anybody more so students like animals. This pervertion will be dealt with aptly. https://t.co/y69J0XcTA6
— S.Suresh Kumar, Minister – Govt of Karnataka (@nimmasuresh) October 18, 2019