Nupur Sharma : సేఫ్ గా ఉండాలంటే మీ షాపుల్లో రాళ్లు, గడ్డపారలు, తుపాకులు పెట్టుకోండి : బీజేపీ ఎమ్మెల్యే
ప్రజలు తమ ఇల్లు, షాపుల వంటివి సురక్షింతంగా ఉండాలి అంటే రాళ్లు, గడ్డపారలు, తుపాకులుదగ్గర పెట్టుకోవాలని సూచించారు.
- nagamani
- Published On : July 11, 2022 / 11:04 AM IST
Bjp Mla Vikram Saini Controversy Speech Over Nupur Sharma Row
BJP MLA Vikram Saini controversy speech over Nupur Sharma row : ఇప్పటికే బీజేపీ బహిషృత నేత నుపుర్ శర్మ వివాదాలకు కేంద్రంగా మారిన విషయం తెలిసిందే. అసలు బీజేపీ నేతలు ఏం మాట్లాడినా వివాదం అవుతుందా? లేదా వివాదాలు అయ్యే వ్యాఖ్యలే వారు చేస్తారా? అనేలా ఉంది పరిస్థితి. ఈక్రమంలో యూపీలో మరో బీజేపీ నేత చేసిన వ్యాఖ్యలు వివాదంగా మారాయి.
ఉత్తరప్రదేశ్లోని ముజఫర్నగర్ జిల్లా ఖతౌలీ బీజేపీ ఎమ్మెల్యే విక్రం సైనీ ..ప్రజలు తమ ఇల్లు, షాపుల వంటివి సురక్షింతంగా ఉండాలి అంటే రాళ్లు, గడ్డపారలు, తుపాకులు అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. దీనికి సంబంధించిన వీడియో వెలుగులోకి రావటంతో ఎమ్మెల్యే వ్యాఖ్యలు వివాదాస్పందగా మారాయి. ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ఘన విజయం సాధించినందుకు కేంద్ర సహాయ మంత్రి సంజీవ్ బల్యాన్, ఎమ్మెల్యే విక్రమ్ సైనీలకు జన్సత్ తహసీల్ ప్రాంతంలోని వాజిద్పూర్ కావాలి గ్రామంలో సన్మానం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విక్రం సైనీ మాట్లాడుతూ..పోలీసులు ఎన్ని రోజులని..ఎంతమందినని కాపాడతారు? వారికి సమాచారం అంది వారొచ్చేసరికి మీకు ఏమైన ప్రమాదం రావచ్చు..ఆందోళనకారులు మీ షాపులు ధ్వంసం చేయొచ్చు..అందుకే ముందు జాగ్రత్తగా మీ షాపుల్లో రాళ్లు, గడ్డపారలు, తుపాకులు అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు.ఎమ్మెల్యే వ్యాఖ్యలను ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయటంతో వివాదంగా మారింది.
ఆ వీడియోలో విక్రం సైనీ మాట్లాడుతూ.. ‘‘రెండు పెట్టెల్లో రాళ్లు పెట్టుకోండి. నాలుగైదు గడ్డపారలు కూడా ఉంచుకోండి. మరో రెండు తుపాకులు కూడా దగ్గర పెట్టుకోండి. పోలీసులు మాత్రం ఎంతకాలమని పనిచేస్తారు? పోలీసులు వచ్చే సరికి మీ షాపులను ఆందోళనకారులు తగలబెట్టేస్తున్నారు..అందుకే ఆయుధాలను దగ్గర ఉంచుకోండి’’ అని ఆయన అన్నారు. ఎమ్మెల్యే ఆ వ్యాఖ్యలు చేస్తున్నప్పుడు కొందరు నేతలు ఆయనను ఆపేయత్నం చేశారు. కానీ ఆయన మాత్రం ‘‘నన్ను మాట్లాడనివ్వండి. ఇది న్యూస్పేపర్లలో రాసుకోమనండి. టీవీల్లో చూపించుకోమనండి. ఐదేళ్ల వరకు ఎవరూ నన్నేమీ చేయలేరు. నాకు ఇంతకుమించిన కోరిక కూడా లేదు’’ అంటూ ఏమాత్రం తగ్గేదిలేదు అన్నట్లుగాను..నేను చెప్పాలనుకున్నది చెప్పి తీరుతాను అన్నట్లుగా వ్యాఖ్యానించారు.
ఉదయ్పూర్ ఘటన గురించి మాట్లాడుతూ.. నుపుర్ శర్మ మాట్లాడడం ఆమె ప్రజాస్వామ్య హక్కు అని అన్నారు. ‘‘హిందూ దేవతలకు వ్యతిరేకంగా ఎవరైనా ఏదైనా మాట్లాడొచ్చా?.. వారికి వ్యతిరేకంగా మాట్లాడితే మాత్రం తల నరికేస్తారా?’’ అంటూ ఘాటులగా ప్రశ్నించారు బీజేపీ ఎమ్మెల్యే విక్రం సైనీ..
