Kerala : మా రాష్ట్రం పేరును మార్చండి.. కేంద్రానికి కేరళ శాసనసభ వినతి.. ఎందుకు మార్చాలనుకుంటోంది?
కేరళ పేరును అన్ని భాషల్లో ‘కేరళం’ గా మార్చాలని సీఎం పినరయి విజయన్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
- Harishth Thanniru
- Published On : August 10, 2023 / 10:35 AM IST
Kerala
Kerala State New Name: కేరళ రాష్ట్రం పేరు మార్చుతూ ఆ రాష్ట్ర శాసనసభ ఏకగ్రీవ తీర్మానం చేసింది. రాష్ట్రం పేరును మార్చుతూ సంబంధించిన తీర్మానాన్ని సీఎం పినరయి విజయన్ బుధవారం సభలో ప్రవేశపెట్టారు. పార్టీలకతీతంగా అందరూ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. ఈ సందర్భంగా విజయన్ మాట్లాడుతూ.. కేరళ పేరును అన్ని భాషల్లో ‘కేరళం’ గా మార్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. రాజ్యాంగంలోని మొదటి షెడ్యూల్లో రాష్ట్రం పేరును కేరళ అని రాశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ప్రకారం దానిని కేరళంగా సవరించాలి. రాజ్యాంగంలోని ఎనిమిదో షెడ్యూల్లో పేర్కొన్న అన్ని భాషల్లో తక్షణమే మార్పులు చేయాలని కేంద్రాన్ని కోరారు. రాష్ట్ర అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానంచేసి కేంద్ర ప్రభుత్వాన్ని పంపిస్తోందని సీఎం విజయన్ అన్నారు.
Rajinikanth : రజినీకాంత్ పంచ్ డైలాగ్.. వైసీపీ నాయకులకేనా? సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో..
కేరళ రాష్ట్రం ఎలా ఏర్పడింది..
1947లో భారతదేశం స్వాతంత్ర్యంరాగా 1941 జులై1న తిరువాన్కూరు, కొచ్చిన్ సంస్థానాలను కలిపి తిరువాన్కూర్ – కొచ్చిన ఏర్పరిచారు. 1950 జనవరి 1న దీనిని ఒక రాష్ట్రంగా గుర్తించారు. అదే సమయంలో మద్రాసు ప్రెసిడెన్సీని మద్రాసు రాష్ట్రం చేశారు. 1956 నవంబర్ 1న రాష్ట్ర పున:వ్యవస్థీకరణ చట్టం ప్రకారం కేరళ రాష్ట్రం ఏర్పడింది. కేరళకు ఆ పేరెలా వచ్చిందనే విషయంలో వివాదం ఉంది. కేర అంటే కొబ్బరి చెట్టు, ఆళం అంటే భూమి. ఈ రెండింటి నుండి కొబ్బరిచెట్ల భూమిగా కేరళం అయింది అనేది వాదన.
ఇటీవలి పేరుమార్పులు..
పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం బెంగాలీ, ఇంగ్లీష్, హిందీ అనే మూడు భాషల్లో రాష్ట్రాన్ని ‘బంగ్లా’గా మార్చాలని కోరుతోంది. దీనికి సంబంధించి మమతా బెనర్జీ నేతృత్వంలోని ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలు అందాయని కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ గత జూలైలో పార్లమెంటులో తెలిపింది. అదేవిధంగా 2011లో ఒరిస్సా ఒడిషాగా మారింది. దాని భాష పేరు ఒరియా నుండి ఒడియాగా మార్చబడింది. ఒరిస్సా(పేరుమార్పు) బిల్లు 2010లో రాజ్యాంగ (113 వ సవరణ ) బిల్లు 2010 పార్లమెంటులో ఆమోదించబడింది.
ఇది రాష్ట్రాలకు మాత్రమే కాదు.. గత కొన్ని సంవత్సరాలుగా అనేక నగరాల పేర్లు కూడా మార్చడం జరిగింది. ఏపీలోని రాజమండ్రి నగరం పేరు 2017లో రాజమహేంద్రవరంగా సవరించారు. జార్ఖండ్లోని నగర్ అంటరి అనే పట్టణం 2018లో శ్రీ బన్షీదర్ నగర్ గా మారింది. అదే సంవత్సరం ఉత్తరప్రదేశ్ లోని అలహాబాద్ ప్రయాగ్రాజ్ గా పేరు మార్చారు. 2021లో మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని హోషంగాబాద్ నగర్ పేరును నర్మదాపురంగా మార్చారు. ఇలా దేశంలోని పలు రాష్ట్రాలు, నగరాల పేర్లు గతంలో పార్లమెంట్ వేదికగా మార్చబడ్డాయి.
