క్షీణించిన లాలూ ఆరోగ్యం..ప్రత్యేక విమానంలో రాంచీ బయల్దేరిన కుటుంబసభ్యులు
- venkaiahnaidu
- Published On : January 22, 2021 / 06:27 PM IST
Lalu Prasad’s health deteriorates, daughter Misa Bharti reaches RIMS Ranchi రాష్ట్రీయ జనతా దళ్(RJD)ఆర్జేడీ అధినేత, బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ ఆరోగ్య పరిస్థితి విషమించింది. దాణా కుంభకోణం కేసులో రాంచీ జైలులో శిక్ష అనుభవిస్తున్న లాలూ ఆరోగ్యం గురువారం సాయంత్రం ఒక్కసారిగా క్షీణించింది. దీంతో వెంటనే ఆయనను రాంచీలోని రిమ్స్కు తరలించారు.
కాగా,కొంతకాలంగా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో లాలూ బాధపడుతున్న తెలుస్తోంది. కొంతకాలంగా అనారోగ్య కారణాలతో ఆయన ఎక్కువ కాలం రిమ్స్ ఆసుపత్రిలోనే ఉన్న విషయం తెలిసిందే. తాజాగా లాలూ ఆరోగ్యం విషమించిన నేపథ్యంలో ఆయన కూతురు మీసా భారతి ఇప్పటికే రాంచీలోని రిమ్స్ కు చేరుకున్నారు. లాలూ భార్య రబ్రీ దేవి,చిన్న కుమారుడు తేజశ్వి యాదవ్ కూడా హుటాహుటిన ప్రత్యేక విమానంలో పాట్నా నుంచి రాంచీకి బయలుదేరారు.
ప్రస్తుతం లాలూ ఆరోగ్యం నిలకడగా ఉందని..ఆయన ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ ఉందని..ట్రీట్మెంట్ కొనసాగుతోందని రిమ్స్ డైరెక్టర్ డాక్టర్ కామేశ్వర్ ప్రసాద్ తెలిపారు. తాము ఎయిమ్స్ లోని ఊపిరితిత్తుల డిపార్ట్మెంట్ HODని కూడా సంప్రదించినట్లు తెలిపారు. లాలూకి ర్యాపిడ్ యాంటీజన్ విధానంలో కోవిడ్ టెస్ట్ కూడా చేశామని..ఫలితం నెగిటివ్ గా వచ్చిందని తెలిపారు. RT-PCR విధానంలో చేసిన కోవిడ్ టెస్ట్ ఫలితం రేపు వస్తుందని తెలిపారు.
