కోవిడ్-19తో తలెత్తిన అవసరాలను తీర్చే క్రమంలో భాగంగా.. పార్లమెంట్ సభ్యుల వేతనాల్లో ఏడాది పాటు 30 శాతం కోత విధించేందుకు రూపొందించిన బిల్లు ‘సాలరీ, అలవెన్స్ అండ్ పెన్షన్ ఆఫ్ మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ ఆర్డినెన్స్,2020’ ను మంగళవారం లోక్సభ ఏకగ్రీవంగా ఆమోదించింది.
కాగా, ఎంపీల జీతాల్లో కోత విధించాలని ఈ ఏడాది ఏప్రిల్ లో కేంద్రం నిర్ణయించిన విషయం తెలిసిందే . ఏప్రిల్- 6న ఈ ప్రదిపాదనకు కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ఆ తర్వాతి రోజే ఆర్డినెన్స్ జారీ అయింది.
లోక్సభలో 543, రాజ్యసభలో 245 మంది సభ్యులున్నారు. సాధారణంగా ఎంపీలకు వేతనాల రూపంలో నెలకు రూ. లక్ష అందాల్సి ఉంటుంది. ఆర్డినెన్స్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ఏప్రిల్ నుంచి రూ. 70వేలు మాత్రమే పొందుతున్నారు.
మరోవైపు డీజీసీఏ, ఏఏఐబీ, బీసీఏఎస్లకు చట్టపరమైన అధికారాలను కల్పించే ఎయిర్క్రాఫ్ట్ సవరణ బిల్లు రాజ్యసభ ఆమోదం పొందడం పట్ల పౌరవిమానయాన మంత్రి హర్దీప్ సింగ్ పూరి హర్షం వ్యక్తం చేశారు. ఈ బిల్లు ఆమోదంతో భారత పౌరవిమానయాన రంగంలో భద్రత మౌలికసదుపాయాలు మరింత బలోపేతమవుతాయని ఆయన పేర్కొన్నారు.