Lok sabha Elections 2024: ఎన్నికల నగారా మోగేందుకు సమయం ఆసన్నమవుతోందా?
లోక్సభ ఎన్నికలతో పాటు ఏపీ, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీలకు ఎన్నికలు జరగాల్సి ఉంది.
- T Venkateshwarlu
- Published On : March 9, 2024 / 06:11 PM IST
VOTE
Lok sabha Elections 2024: లోక్సభ ఎన్నికలకు వచ్చే గురువారం లేదా శుక్రవారం నగారా మోగనున్నట్లు తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికల తేదీలపై ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు పూర్తి చేసుకుంది. అలాగే, కొన్ని రోజులుగా పలు రాష్ట్రాల్లో పర్యటించింది. రాజకీయ పార్టీలతో పాటు స్థానిక అధికారులతో సమావేశాలు నిర్వహించింది.
సోమవారం నుంచి బుధవారం వరకు జమ్మూకశ్మీర్లో ఈసీ పర్యటించనుంది. ఇదే ఈసీకి చివరి పర్యటన. దీంతో ఆ తర్వాతి రోజు లేదా శుక్రవారం షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉన్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. సెప్టెంబరులోగా జమ్మూకశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే.
జమ్మూ కశ్మీర్లో లోక్సభ ఎన్నికలతో పాటు యూటీలో అసెంబ్లీ ఎన్నికలను ఒకేసారి నిర్వహించవచ్చా? అన్న విషయంపై కేంద్ర ఎన్నికల సంఘం పరిశీలన చేస్తోంది. జమ్మూకశ్మీర్లో భద్రతపై ఎన్నికల అధికారులు చర్చించనున్నారు.
లోక్సభ ఎన్నికలతో పాటు ఏపీ, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. జమ్మూకశ్మీర్లో చివరిసారిగా అసెంబ్లీ ఎన్నికలు 2014లో జరిగాయి. 2019లో ఆర్టికల్ 370 రద్దు చేసిన విషయం తెలిసిందే.
కాగా, లోక్సభ ఎన్నికలకు ఇప్పటికే పలు రాజకీయ పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటిస్తున్నాయి. ప్రచారంలో మునిగితేలుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ లోక్ సభ ఎన్నికల ప్రచార షెడ్యూల్ కూడా ఖరారైంది.
