LPG booking period increased
LPG booking period increased : గృహ అవసరాలకు వినియోగించే ఎల్పీజీ (LPG) గ్యాస్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం మరో బిగ్ షాకిచ్చింది. ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా వార్ నేపథ్యంలో గత నాలుగు రోజుల క్రితం గ్యాస్ ధరలను కేంద్రం భారీగా పెంచేసిన విషయం తెలిసిందే. గృహ అవసరాలకు వాడే వంట గ్యాస్ సిలిండర్ పై రూ.60, వాణిజ్య సిలిండర్లపై రూ. 114.5 పెంచింది. అయితే, తాజాగా.. సిలిండర్ బుకింగ్ గడువును పెంచుతూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.
Also Read : Acid Rain In Iran : ఇరాన్ పై యాసిడ్ వర్షం.. ఇది జనం శరీరం మీద పడితే..
సిలిండర్లకు కొరత ఏర్పడొచ్చన్న భయాలతో కొందరు ముందస్తుగా గ్యాస్ బుక్ చేస్తున్నారు. గతంలో సగటున 55 రోజులకు ఒకసారి సిలిండర్ బుక్ చేసుకునే వాళ్లుసైతం ప్రస్తుత పరిస్థితుల్లో 15రోజులకే బుక్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఎల్పీజీ సిలిండర్ల కొరత ఏర్పడే పరిస్థితి ఏర్పడింది. దీంతో ఎల్పీజీ సిలిండర్ల బ్లాక్ మార్కెటింగ్ను నివారించేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.
ప్రస్తుతం సిలిండర్కు సిలిండర్కు మధ్య ఉన్న బుకింగ్ గడువును 21 నుంచి 25రోజులకు పెంచేసింది. దీంతో ఒక సిలిండర్ బుకింగ్ తరువాత మరో సిలిండర్ బుక్ చేసుకోవాలంటే కనీసం 25 రోజులు ఆగాల్సిందే.
మరోవైపు.. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య వార్ కారణంగా.. గ్యాస్ కొరత ఏర్పడుతుంది. దీంతో గృహ వినియోగదారుల ఎల్పీజీ సరఫరాకు అంతరాయం లేకుండా చూడాలని, కమర్షియల్ వినియోగదారులకంటే గృహ వినియోగదారులకే అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ఆయిల్ రిఫైనరీలకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం దేశంలో సుమారు 25 నుంచి 30 రోజులకు సరిపడా గ్యాస్ నిల్వలు అందుబాటులో ఉన్నాయని, కావున అనవసరంగా ముందస్తు బుకింగ్లు చేసి ఇతరులకు ఇబ్బంది కలిగించొద్దని అధికారులు కోరుతున్నారు.
మరోవైపు.. పశ్చిమాసియాలో యుద్ధం ఇంకా కొనసాగుతోంది.. మరికొన్ని రోజులుపాటు యుద్ధం కొనసాగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీంతో దేశంలో గ్యాస్ సిలిండర్ల కొరత ఏర్పడకుండా కేంద్రం ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటుందని తెలుస్తోంది. ఈ క్రమంలో ఎల్పీజీ విక్రయానికి అల్జీరియా, ఆస్ట్రేలియా, కెనడా, నార్వే వంటి దేశాలు ముందుకొచ్చాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలపైనా ప్రభుత్వ వర్గాలు కీలక విషయాన్ని తెలిపాయి. ముడి చమురు ధరలు బ్యారెల్ కు 130 డాలర్లకు చేరుకునే వరకు భారతదేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే అవకాశం లేదని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. భారతదేశంలో తగినంత ఇంధన నిల్వలు ఉన్నందున ఇందన ధరలు పెరిగే అవకాశం లేదని చెప్పాయి. హార్ముజ్ జలసంధి మార్గం కాకుండా ఇతర మార్గాల నుండి కూడా ముడి చమురు సేకరణను వేగవంతం చేసినట్లు ప్రభుత్వ వర్గాల సమాచారం.