వినియోగదారులపై మళ్లీ వంటగ్యాస్ భారం పడింది. విమాన ఇంధనం, రాయితీ లేని వంటగ్యాస్ ధరలను పెంచేశారు. ఏవియేషన్ టర్బైన్ గ్యాస్(ఏటీఎఫ్ ఫ్యూయెల్) కిలోలీటర్ ధర ఢిల్లీలో రూ.677.10 పెరిగి రూ.63,472.22కు చేరుకుంది. అలాగే 14.2 కిలోల నాన్-సబ్సిడీ ఎల్పీజీ సిలిండర్ ధర కూడా రూ.5.29 పెరిగి రూ.706.50కు చేరుకుంది. సబ్సిడీ సిలిండర్ ధరలో మాత్రం మార్పు లేదు.
దేశ రాజధాని ఢిల్లీలో సబ్సిడీ ద్వారా పొందే వంట గ్యాస్ సిలిండర్ ధర రూ.495.86గా ఉంది. అంతర్జాతీయ మార్కెట్ ధరల ప్రకారం ఈ మార్పులు చేసినట్లు ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ సంస్థలు వెల్లడించాయి. అంతకుముందు మార్చి 1వ తేదీన ఏటీఎఫ్ ధర రూ.4,734.15, నాన్-సబ్సిడీ ఎల్పీజీ సిలిండర్ ధర రూ.42.5 చొప్పున పెరిగిన సంగతి తెలిసిందే. ఈ కేలండర్ ఇయర్లో గ్యాస్ ధరలు పెరగడం ఇది రెండవసారి.