Living Will: నచ్చినట్టు ‘చచ్చిపోవడానికి’ ఓ వీలునామా..

Living Will: వీలునామా. ఈ పేరు వినగానే అందరికీ ఒకటే గుర్తుకొస్తుంది. ఓ వ్యక్తి చనిపోయిన తర్వాత తన తదనంతరం స్థిర చరాస్తులు, వ్యాపారాలు, ఇతరత్రా నగదు, బంగారం ఎవరికి చెందాలని రాస్తారు కదా. కానీ, ఈ వీలునామా వేరు.

  • Published on- June 6, 2026 / 12:54 PM IST

maharashtra brings living will want to die with dignity explained

Living Will: వీలునామా. ఈ పేరు వినగానే అందరికీ ఒకటే గుర్తుకొస్తుంది. ఓ వ్యక్తి చనిపోయిన తర్వాత తన తదనంతరం స్థిర చరాస్తులు, వ్యాపారాలు, ఇతరత్రా నగదు, బంగారం ఎవరికి చెందాలని రాస్తారు కదా. అదే. అని చాలా మంది అనుకుంటారు. కానీ, ఈ వీలునామా వేరు. ఓ వ్యక్తి తన జీవిత చరమాంకంలో ఉండగా, ఆస్పత్రిలో తనకు ‘నచ్చినట్టు చనిపోవడానికి’ (Living Will) రాసుకునే పత్రం. ఇది కూడా వీలునామానే. దీన్నే డై విత్ డిగ్నిటీ. అంటే గౌరవంగా మరణించే హక్కుగా చెబుతారు. మహారాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి వీలునామాను తీసుకొచ్చింది.

ఎవరు రాస్తారు? ఏం రాస్తారు?

ఒక వ్యక్తి క్యాన్సర్ వల్లో, ప్రమాదాల వల్లో, ఇతరత్రా తీవ్ర అనారోగ్య సమస్యల వల్లో ఆస్పత్రి పాలయ్యారు. ఇంక వాళ్లు కోలుకునే అవకాశం లేదు. అలాంటప్పుడు వాళ్లు తాము ఎలా చనిపోవాలని కోరుకుంటే ఆ రకంగా చనిపోవచ్చు. అయితే, ఇంజెక్షన్ ఇచ్చి చంపేయండి అని కోరడానికి వీల్లేదు. యుథెన్సియా అనేది భారతదేశంలో అమలులో లేదు. కారుణ్యమరణం లాంటివి లేవు. కానీ ఈ వీలునామాలో కొన్ని అంశాలు రాయవచ్చు. అవేంటో చూద్దాం.

ఒక వ్యక్తి తీవ్రమైన గుండె సంబంధిత వ్యాధి, లివర్, కిడ్నీ లేదా ఊపిరితిత్తుల ఫెయిల్యూర్ తో ఆస్పత్రిలో చేరేరనుకుందాం.. ఆ పరిస్థితి నుంచి వాళ్లు కోరుకునే అవకాశం లేకపోతే.. అలాంటప్పుడు వాళ్లు ‘నాకు ఈ వెంటిలేటర్లు వద్దు. ఏం వద్దు. ప్రతి సారీ ఈ నరకం నేను భరించలేకపోతున్నా. నా మానాన నన్ను వదిలేయండి. ఇలాంటివేం వద్దు. బతికినంతకాలం బతుకుతా. పోయినప్పుడు పోతా. అంతే కానీ ఇవేం వద్దు.’ అని కోరుకుంటే.. వాళ్లు వీలునామాలో ‘వెంటిలేటర్లు వద్దు. ట్యూబ్ లు పెట్టొద్దు. ఇతరత్రా ట్రీట్ మెంట్ వద్దు.’ అని రాయొచ్చు.

Also Read: కాక్రోచ్ జనతా పార్టీకి భారీ ఊరట.. ధర్నాకు అనుమతి.. ఢిల్లీలో అడుగుపెట్టిన సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే..

లీగల్ గా రిజిస్ట్రేషన్ అవసరం

ఈ లివింగ్ విల్ అనేది మాటలతో సరిపోదు. దీన్ని రిజిస్ట్రేషన్ చేయించాలి. తనపై ఎలాంటి ఒత్తిడి లేకుండా రాయాలి. దానిపై ఆ వ్యక్తి సంతకం చేయాలి. మరో ఇద్దరు సాక్షి సంతకాలు చేయాలి. దాన్ని మళ్లీ డాక్టర్లు సమీక్ష చేస్తారు.

తాను వీలునామాలో రాసినట్టు జరుగుతుందా లేదా అని చెక్ చేయడానికి ఆ వ్యక్తి ఒక ప్రతినిధిని కూడా నియమిస్తారు. ఒకసారి పేపర్లు రెడీ అయ్యాక ఆ వీలునామాను రిజిస్ట్రేషన్ చేయించాలి. అది ఆన్ లైన్ లో అయినా కావొచ్చు. లేకపోతే లోకల్ మున్సిపాలిటీలో కూడా కావొచ్చు. దాన్ని పరిశీలించిన తర్వాత రిజిస్ట్రేషన్ చేస్తారు. దాని స్టాంప్ కాపీ వీలునామా రాసిన వ్యక్తికి అందుతుంది.

ఇది ప్రస్తుతం మహారాష్ట్రలోనే అమల్లోకి వచ్చింది. ఏప్రిల్ 17 నుంచి ఈ లివింగ్ విల్ ను అమల్లోకి తెచ్చింది అక్కడి ప్రభుత్వం. దీన్ని అన్ని రాష్ట్రాలు అమల్లోకి తేవాలని న్యాయ నిపుణులు సూచిస్తున్నారు. అయితే, ఈ లివింగ్ విల్ అనేది కచ్చితంగా అమలవుతుందా అంటే కూడా ఒక్కోసారి కాకకపోవచ్చు. ఎందుకంటే ఒక డాక్టర్ గా పేషెంట్ ను బ్రతికించడానికి ప్రయత్నించేక్రమంలో కొన్ని టెస్టులు చేస్తారు. కొంత లైఫ్ సపోర్ట్ అందిస్తారు. అది వాళ్ల వృత్తి ధర్మం. దాన్ని కాపాడాల్సిన బాధ్యత కూడా వాళ్లపై ఉంటుంది.