మహా ట్విస్ట్ : సీఎంగా శివసేన ఎంపీ..?

  • Publish Date - November 22, 2019 / 05:22 AM IST

నెల రోజులకుపైగా కొనసాగుతున్న మహా డ్రామాకు తెరపడే అవకాశం కనిపిస్తోంది. ప్రభుత్వ ఏర్పాటుకు శివసేన చేస్తున్న ప్రయత్నాలు దాదాపు కొలిక్కి వచ్చేనట్లే. సంకీర్ణ సర్కార్ ఏర్పాటుపై శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ మధ్య చర్చలు సక్సెస్ అయినట్టే. కనీస ఉమ్మడి ప్రణాళిక, అధికార పంపిణీపై మూడు పార్టీలూ ఒక అవగాహనకు వచ్చినట్లు చెబుతున్నారు. ముఖ్యంగా శివసేన-ఎన్సీపీలు చెరో రెండున్నరేళ్లు సీఎం పదవిని పంచుకునేలా.. కాంగ్రెస్‌కు ఐదేళ్లపాటు డిప్యూటీ సీఎం ఇవ్వాలన్న ప్రతిపాదనపై అంగీకారం కుదిరినట్లు తెలుస్తోంది.

పదవుల పంపకం ఉమ్మడి ప్రణాళికతోపాటు లౌకిక స్ఫూర్తికి కట్టుబడాలన్న ప్రతిపాదనలపై శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ దాదాపు అవగాహనకు రావడంతో ప్రభుత్వ ఏర్పాటు దిశగా అడుగులు పడుతున్నాయి. తొలి టర్మ్‌లో శివసేన నుంచి ఉద్ధవ్‌ థాక్రే సీఎం పదవి చేపడతారని, కాంగ్రెస్‌ నుంచి బాలాసాహెబ్‌, ఎన్సీపీ నుంచి అజిత్ పవార్‌లు డిప్యూటీ సీఎంలుగా ప్రభుత్వం ఏర్పాటవుతుందని అంటున్నారు. మంత్రి పదవులు పంపకంపైనా కసరత్తు జరుగుతోందని సమాచారం.

ఇది ఇలా ఉంటే.. ప్రభుత్వ ఏర్పాటుపై చర్చలు కొలిక్కి వస్తున్నాయి. ఎన్సీపీ, శివసేన, కాంగ్రెస్ ముఖ్య నేతలు సమావేశం కానున్నారు. ప్రభుత్వ ఏర్పాటుపై చర్చించనున్నారు. ఈ చర్చల తర్వాత ప్రభుత్వ ఏర్పాటుపై ప్రకటన వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది. 

అదే సమయంలో కొత్త అంశం తెరపైకి వచ్చింది. సీఎంగా శివసేన చీఫ్ ఉద్దవ్ థాక్రే ఉండాలని ఎన్సీపీ కోరుతోంది. అయితే సీఎం పదవి చేపట్టేందుకు ఉద్దవ్ థాక్రే సిద్ధంగా లేరని శివసేన వర్గాలు చెబుతున్నాయి. ఒక వేళ ఉద్దవ్ థాక్రే నిరాకరిస్తే.. శివసేన సీనియర్ నేత, ఎంపీ సంజయ్ రౌత్ పేరుని సీఎం పదవికి పరిశీలించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. మరోవైపు శనివారం(నవంబర్ 22,2019) మూడు పార్టీల ఎమ్మెల్యేలు సమావేశం కానున్నారు.