Derogatory Remarks : తమిళనాడులోని కూనూర్ సమీపంలో డిసెంబర్-8న జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో దేశపు తొలి త్రివిధ దళపతి బిపిన్ రావత్ మరణించడం దేశాన్ని శోఖసంద్రంలో ముంచింది. దేశాన్ని కంటికి రెప్పలా కాపాడే వ్యక్తి మరణించడంతో యావత్ దేశం కంటతడి పెట్టింది. ఆర్మీ హెలికాప్టర్ కుప్పకూలిన ఘటనలో సీడీఎస్ బిపిన్ రావత్ తో పాటు ఆయన సతీమణి మధులిక రావత్, మరో 11 మంది దుర్మరణం చెందగా..మరొకరు తీవ్రగాయాలతో చికిత్స పొందుతున్నారు. ఇదిలా ఉంటే కొంతమంది మాత్రం రావత్ మరణంపై అనుచిత పోస్టులు పెడుతున్నారు.
బిపిన్ రావత్,సాయుధ బలగాల గురించి అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసిన ఫిరోజ్ దివాన్ అనే వ్యక్తిని శనివారం గుజరాత్ పోలీసులు అరెస్ట్ చేశారు. హెలికాఫ్టర్ ప్రమాదంలో మరణించిన రావత్ సహా మిగిలిన 12మందికి నివాళులర్పిస్తూ అనూజ్ దిమాన్ శర్మ అనే వ్యక్తి ఓ పోస్ట్ ను తన ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు. అయితే ఈ పోస్ట్ పై ఫిరోజ్ దివాన్ అనే గుజరాతీ వ్యక్తి..రావత్ మరియు ఆయన పదవిని కించపరిచేలా, అదేవిధంగా ప్రజలు మరియు సాయుధబలగాల ఫీలింగ్స్ ను అవమానపరిచేలా కామెంట్ చేశాడని ఓ పోలీస్ అధికారి తెలిపారు.
బరూచ్ రూరల్ పోలీస్ స్టేషన్ లో వివిధ సెక్షన్ల కింద ఫిరోజ్ దివాన్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు తెలిపారు. శుక్రవారమే ఫిరోజ్ దివాన్ ని అరెస్ట్ చేశామని,తదుపరి దర్యాప్తు జరుగుతోందని ఆ అధికారి తెలిపారు.
మరోవైపు, గురువారం రాజస్తాన్లోని నాజర్బాగ్ కు చెందిన 21 ఏళ్ల జావేద్ ఖాన్ రావత్ మరణాన్ని అవమాన పరిచేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడంతో పోలీసులు అతడిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. దీనికి ముందు వివిధ రాష్ట్రాల్లో కూడా రావత్ మరణంపై సోషల్ మీడియాలో అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసిన పలువురు అరెస్ట్ అయ్యారు.
ALSO READ Nagaland Rally : అమిత్ షాకు వ్యతిరేకంగా..నాగాలాండ్ లో భారీ నిరసన ర్యాలీ