Viral News: మూడు రోజులు శిథిలాల కింద.. బయటకి రాగానే నా చెప్పులేవి!
మూడు రోజుల పాటు కుప్పకూలిన భవనం శిథిలాల కింద పడి ఎవరైనా బయటపడితే మొదట వారి కుటుంబ సభ్యులను చూడాలనో.. లేక వాళ్ళని కాపాడిన వాళ్ళని చూడాలనుకుంటారు.
- Naresh Mannam
- Published On : August 28, 2021 / 06:31 AM IST
Viral News
Viral News: మూడు రోజుల పాటు కుప్పకూలిన భవనం శిథిలాల కింద పడి ఎవరైనా బయటపడితే మొదట వారి కుటుంబ సభ్యులను చూడాలనో.. లేక వాళ్ళని కాపాడిన వాళ్ళని చూడాలనుకుంటారు. కానీ, ఓ వ్యక్తి మాత్రం 72 గంటల పాటు కూలిన భావన శిథిలాల కింద నుండి బయటపడగానే నా చెప్పులు ఎక్కడ అని అడిగాడు. నమ్మశక్యంగా లేకపోయినా ఇది నిజం. కాకపొతే ఇది ఇప్పుడు జరిగింది కాదు. 2014లో చెన్నైలో ఒక 12 అంతస్థుల భవనం కుప్పకూలిన ఘటన గుర్తుందా.. ఆ ప్రమాదంలో శిథిలాల కింద ఉన్న వ్యక్తి బయటకి రాగానే చెప్పులు ఎక్కడ అని అడిగాడట.
అప్పుడెప్పుడో 2014లో జరిగిన ఘటన గురించి ఇప్పుడెందుకు మాట్లాడుకోవడం అంటారా.. ఆ చెప్పుల స్టోరీ ఇప్పుడు మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సోషల్ మీడియాలో ఎప్పుడు ఏ అంశం వైరల్ అవుతుందో.. ఆ పోస్ట్ చేసే వారికి కూడా తెలియకపోగా ఇప్పుడు ఈ చెప్పుల స్టోరీ వంతైంది. అప్పుడు ఆ ప్రమాదం జరిగిన సమయంలో ఆ బిల్డింగ్ శిథిలాల కింద వికాస్ అనే ఒక వ్యక్తి ఉండిపోయాడు. మూడు రోజులపాటు ఆ శిథిలాల కిందనే చిక్కుకుపోగా మూడో రోజు రెస్క్యూ టీమ్ సిబ్బంది వికాస్ను శిథిలాల నుంచి బయటికి తీసుకువచ్చారు.
అయితే సురక్షితంగా బయటికి రాగానే వికాస్ నా చెప్పులు ఎక్కడున్నాయి అని కంగారు పడుతూ అడగడంతో అక్కడ ఉన్న వారితో పాటు వికాస్ ను బయటకి తీసిన రెస్క్యూ టీం ఆశ్చర్యపోయిందట. దాదాపు ఏడేళ్ల క్రితం జరిగిన ఈ ఘటనకు సంబంధించి ప్రస్తుతం ఈ పోస్టు వైరల్ గా మారింది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారట.
