Jammu Kashmir Cloud Burst: జమ్ముకశ్మీర్ లో క్లౌడ్ బరస్ట్ బీభత్సానికి మృతుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. భారీ వరదలకు ఇప్పటివరకు 40 మందికి పైగా భక్తులు మృతి చెందారు. దాదాపు 120 మంది గాయపడ్డారు. చనిపోయిన వారిలో ఇద్దరు సీఐఎస్ఎఫ్ సిబ్బంది ఉన్నారు. అటు భారీ వరదలకు 200 మంది గల్లంతయ్యారు. మచైల్ మాతా ఆలయానికి వెళ్లే దారిలో ఈ ఘటన జరిగింది. క్లౌడ్ బరస్ట్ తో ఒక్కసారిగా మెరుపు వరదలు సంభవించాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అటు కుంభవృష్టితో మచైల్ యాత్రను నిలిపివేశారు.
జమ్ముకశ్మీర్ సీఎం, ఎల్జీటీకి కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫోన్ చేశారు. సహాయక చర్యలపై ఆరా తీశారు. కిష్త్వార్ లో సంభవించిన మెరుపు వరదలతో అధికారులు అలర్ట్ అయ్యారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. శిథిలాల కింద చిక్కుకున్న వారిని కాపాడేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఘటనా స్థలంలో పెద్ద ఎత్తున సహాయక చర్యలు చేపట్టి 98 మందిని కాపాడగా, వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
సముద్ర మట్టానికి సుమారు 2వేల 800 మీటర్ల ఎత్తులో ఆలయం..
జమ్ముకశ్మీర్ కిష్ట్వార్ లో క్లౌడ్ బరస్ట్ ఏర్పడింది. దీంతో మెరుపు వరదలు సంభవించాయి.
కిష్ట్వార్ లో సంభవించిన మెరుపు వరదలతో అధికారులు అలర్ట్ అయ్యారు. మచైల్ మాతా ఆలయం సముద్ర మట్టానికి సుమారు 2వేల 800 మీటర్ల ఎత్తులో ఉంది. జూలై 25న ఈ యాత్ర మొదలైంది. జమ్ము డివిజన్ నుంచి వేల సంఖ్యలో యాత్రికులు ఇక్కడికి వచ్చారు. సెప్టెంబర్ 5న ఈ యాత్ర ముగియనుంది.
మెరుపు వరదల ఘటనలో 200 మంది యాత్రికులు గల్లంతయ్యారు. 120 మంది గాయపడ్డారు. గల్లంతైన వారి ఆచూకీ కోసం సహాయక బృందాలు ముమ్మరంగా గాలిస్తున్నాయి. విషయం తెలిసిన వెంటనే సహాయక బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. ప్రాణాలతో ఉన్న వారి కోసం వెతుకుతున్నాయి.
వరద నీటిలో చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి పెద్ద ఎత్తున సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సహాయక చర్యలను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పర్యవేక్షిస్తున్నారు. కిష్త్వార్ ప్రాంతంలో పరిస్థితి గురించి కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు వివరించానని జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తెలిపారు.
ఈ దుర్ఘటన పట్ల ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన సంతాపం తెలిపారు. సహాయక చర్యలను వేగవంతం చేయాలని చెప్పారు.
మందిరం సమీపంలోని చోసిటిలో జరిగిన ఈ సంఘటన గణనీయమైన ప్రాణనష్టానికి దారితీయవచ్చని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ అన్నారు. జమ్మూ కాశ్మీర్లోని ఎల్ఓపీ, స్థానిక ఎమ్మెల్యే సునీల్ కుమార్ శర్మ నుండి అత్యవసర హెచ్చరిక అందిన తర్వాత డిప్యూటీ కమిషనర్ పంకజ్ కుమార్ శర్మతో మాట్లాడానని ఆయన చెప్పారు.