Cyclone Ditwah
Ditwah Cyclone : ఏపీలో ప్రభావం చూపిస్తున్న దిత్వాహ్ తుపాన్ క్రమంగా బలహీనపడుతుంది. తమిళనాడు పుదుచ్చేరి తీరం వెంబడి ఉత్తరం వైపు కదులుతూ భయపెట్టిన సైక్లోన్.. ఆదివారం సాయంత్రానికి తీవ్ర వాయుగుండంగా మారింది. ఇవాళ అది మరింత బలహీనపడుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ఈ క్రమంలో ఏపీలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది.
నైరుతి బంగాళాఖాతం, శ్రీలంక తీరంలో దిత్వాహ్ తుపాను ఉత్తర వాయువ్య దిశగా కదిలి తీవ్ర వాయుగుండంగా బలహీనపడిందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. సోమవారం ఉదయం వాయుగుండంగా బలహీనపడే అవకాశం ఉందని పేర్కొన్నారు. అయితే, మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని సూచించారు. సోమవారం దక్షిణ కోస్తా తీరం వెంబడి గంటకు 45-65 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అన్నారు.
శాటిలైట్ లైవ్ అంచనాల ప్రకారం దిత్వా తుపాను నెమ్మదిగా కదులుతోంది. గంటకు 7 కిలోమీటర్ల వేగంతో ఉత్తరం దిశగా వస్తూ ఉంది. సోమవారం ఉదయం 10 గంటలకు చెన్నైకి 80 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఆ సమయంలో ఏపీలోని తిరుపతికి 180 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. తర్వాత అక్కడ వంకరగా తిరిగి.. యూటర్న్ తీసుకుంటుంది. ఇదిలాఉంటే.. తుపాను తమిళనాడులో తీరం దాటుతుందని మొదట్లో వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. కానీ.. తీరం దాటకుండా ఏపీ వైపుగా బయలుదేరింది. కానీ.. వాతావరణంలో వచ్చిన అనూహ్య మార్పులతో దిత్వాహ్ తుపాన్ యూటర్న్ తీసుకోబోతోంది.
దిత్వాహ్ తుపాన్ కారణంగా సోమవారం ఏపీలోని పలు జిల్లాల్లో భారీ నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిలకు జారీ చేసింది. ముఖ్యంగా నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో కొన్నిచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కోనసీమ, ఫశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలకు అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. బాపట్ల, పల్నాడు, ప్రకాశం, కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.