Mukesh Ambani: బద్రీనాథ్, కేదార్నాథ్లో ముకేశ్ అంబానీ పూజలు.. రూ.10 కోట్ల భారీ విరాళం
రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముకేశ్ అంబానీ(Mukesh Ambani) ప్రముఖ పుణ్యక్షేత్రాలైన బద్రీనాథ్, కేదార్నాథ్ ఆలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
- V Santhosh Kumar
- Published on- June 15, 2026 / 08:28 PM IST
Mukesh Ambani donates 10 crore to Badrinath Temple.
- బద్రీనాథ్, కేదార్నాథ్లలో ముకేశ్ అంబానీ పూజలు.
- ఆలయాల అభివృద్ధికి పదికోట్ల భారీ విరాళం.
- వైభవంగా సాగుతున్న చార్ధామ్ భక్తుల యాత్ర.
Mukesh Ambani: రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముకేశ్ అంబానీ ప్రముఖ పుణ్యక్షేత్రాలైన బద్రీనాథ్, కేదార్నాథ్ ఆలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక హెలికాఫ్టర్లో ఆలయాల వద్దకు చేరుకున్న ఆయనకు బద్రీనాథ్-కేదార్నాథ్ ఆలయ కమిటీ (బీకేటీసీ) ప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. ప్రతి ఏటా ఈ పుణ్యక్షేత్రాలను సందర్శించడం ముకేశ్ అంబానీకి ఒక ఆనవాయితీగా వస్తోంది. ఈ పర్యటనలో భాగంగా ఆయన ఆలయాల్లో స్వామివారిని దర్శించుకుని, వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య ప్రత్యేక అర్చనలు చేశారు.
ఈ సందర్భంగా ఆలయాల అభివృద్ధికి, భక్తుల సౌకర్యార్థం ముకేశ్ అంబానీ(Mukesh Ambani) భారీ విరాళాన్ని ప్రకటించారు. ఆలయ నిర్వహణతో పాటు యాత్రికులకు మరిన్ని మెరుగైన సదుపాయాలు కల్పించేందుకు రూ. 10 కోట్లను విరాళంగా అందజేసినట్లు బీకేటీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సోహన్ సింగ్ రానా వెల్లడించారు. అంబానీ అందించిన ఈ విరాళం చార్ధామ్ యాత్రకు వచ్చే భక్తుల వసతులను మరింత మెరుగుపరచడానికి ఉపయోగపడుతుందని ఆలయ అధికారులు ఈ సందర్భంగా హర్షం వ్యక్తం చేశారు.
ప్రస్తుతం ఉత్తరాఖండ్లో చార్ధామ్ యాత్ర అత్యంత వైభవంగా కొనసాగుతోంది. దేశం నలుమూలల నుండి లక్షలాది మంది భక్తులు స్వామివార్లను దర్శించుకోవడానికి తరలివస్తున్నారు. అధికారిక లెక్కల ప్రకారం, జూన్ 13వ తేదీ నాటికి కేదార్నాథ్ క్షేత్రాన్ని 12.23 లక్షల మందికి పైగా యాత్రికులు సందర్శించగా, బద్రీనాథ్ ఆలయాన్ని 10.92 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ కమిటీ, స్థానిక యంత్రాంగం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశాయి.
