కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అధినేత ముఖేష్ అంబానీ ప్రశంసల వర్షం కురిపించారు. అమిత్ షాను అసలైన కర్మయోగిగా, భారత ఉక్కు మనిషిగా అభివర్ణించారు. గురువారం(ఆగస్టు-29,2019) గాంధీనగర్లోని పండిట్ దీన్ దయాళ్ పెట్రోలియం యూనివర్సిటీ స్నాతకోత్సవంలో అమిత్షా, ముఖేష్ అంబానీ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అమిత్ షాను ఉద్దేశించి ముఖేష్ అంబానీ మాట్లాడుతూ… అమిత్ భాయ్, మీరు అసలైన కర్మయోగి. మీరు అసలైన ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని పొగడ్తల్లో ముంచెత్తారు. మీలాంటి నాయకుడు ఉండటం ఒకప్పుడు గుజరాత్కు, ఇప్పుడు యావత్ దేశానికి అదృష్టం అని కొనియాడారు. భారత ఆర్థిక వ్యవస్థను 5ట్రిలియన్ల డాలర్ల స్థాయికి చేర్చాలన్న ప్రధాని ఆశయం కూడా గొప్పదే అంటూ మోడీని ఆకాశానికెత్తారు. భారత్ ఇప్పుడు సురక్షిత వలయంలో ఉందని ముకేష్ అన్నారు.