×
Ad

Nushrratt Bharuccha: ఆలయంలో నటి పూజలు.. ఇస్లాంకు వ్యతిరేకంగా మహా పాపం చేసిందని మత పెద్దల ఆగ్రహం

నూతన సంవత్సరం సందర్భంగా దైవం ఆశీస్సులు పొందడానికి నుస్రత్ భారుచ్చా ఆలయాన్ని సందర్శించారు. ఇప్పుడీ వ్యవహారం మతం రంగు పులుముకుంది.

Nushrratt Bharuccha Representative Image (Image Credit To Original Source)

  • మతపరమైన వివాదంలో బాలీవుడ్ నటి
  • ఆలయానికి వెళ్లి పూజలు చేయడంపై విమర్శలు
  • పూజలు చేయడం ఇస్లాంకు వ్యతిరేకమన్న మత పెద్దలు
  • మహా పాపం చేసిందని నటిపై ఆగ్రహం

Nushrratt Bharuccha: బాలీవుడ్ బ్యూటీ నుస్రత్ భారుచ్చా వివాదంలో చిక్కుకున్నారు. ఈ మధ్యనే ఆమె మధ్యప్రదేశ్ లోని ఉజ్జయిని మహంకాళి ఆలయాన్ని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజల్లో కూడా పాల్గొన్నారు. ఆలయ నిర్వహణను సైతం ప్రశంసించారు. అయితే, ఓ ముస్లిం అయి ఉండి ఇలా పూజలు ఎలా చేస్తారు అంటూ ఆల్ ఇండియా ముస్లిం జమాతే అభ్యంతరం వ్యక్తం చేసింది. అంతేకాదు ఆమె పెద్ద పాపం చేశారంటూ వివాదం చేసే ప్రయత్నం చేశారు. ఈ విమర్శలపై నుస్రత్ నుంచి ఎలాంటి స్పందన లేదు. నటి ఆలయ సందర్శన, పూజలు చేయడాన్ని తప్పు పట్టడమే అసలైన తప్పు అంటూ ఉజ్జయిని సాధు సంతులు మండిపడ్డారు.

ఆలయానికి వెళ్లి భస్మ హారతిలో పాల్గొన్న నటి..

నుస్రత్ భారుచ్చా చేసిన పని మతపరమైన వివాదానికి దారితీసింది. ఈ నటి ఇటీవల మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో ఉన్న శ్రీ మహాకాళేశ్వర జ్యోతిర్లింగ ఆలయాన్ని సందర్శించారు. ఆమె ఆ పవిత్ర పుణ్యక్షేత్రంలో భస్మ హారతిలో కూడా పాల్గొన్నారు. అయితే, ఆమె ముస్లిం మతానికి చెందిన వ్యక్తి కావడంతో ఆమె ఆలయ సందర్శన చర్చనీయాంశంగా మారింది.

నూతన సంవత్సరం సందర్భంగా దైవం ఆశీస్సులు పొందడానికి నుస్రత్ ఆలయాన్ని సందర్శించారు. జ్యోతిర్లింగ ఆలయ సందర్శనతో నుస్రత్ ను కొందరు టార్గెట్ చేశారు. ముస్లిం అయి ఉండి ఆలయాన్ని ఎలా సందర్శిస్తారని ప్రశ్నించారు. ఒక ముస్లిం నాయకుడు ఆమె చర్యలను తీవ్రంగా విమర్శించారు.

షరియా చట్టం ప్రకారం పూజలు చేయడం మహా పాపం..!
ఆలిండియా ముస్లిం జమాత్ జాతీయ అధ్యక్షుడు మౌలానా షహబుద్దీన్ రజ్వీ బరేల్వీ.. నుస్రత్ పై మండిపడ్డారు. షరియా చట్టం ప్రకారం పూజ చేయడం ఘోరమైన పాపం అని అన్నారు. ఈ చర్యలు ఇస్లాంకు విరుద్ధమన్నారు. అంతేకాదు ఇలా చేసినందుకు పశ్చాత్తాపంతో కల్మా పఠించాలని నటికి సూచించారు.

Actress Nushrratt Bharuccha Representative Image (Image Credit To Original Source)

కాగా, గతంలో ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. మతంపై తన ఉదారవాద అభిప్రాయాలను నటి నుస్రత్ వెల్లడించారు. మీకు ఎక్కడ శాంతి లభిస్తే.. అది మందిరంలో అయినా, గురుద్వారాలో అయినా, చర్చిలో అయినా.. మీరు అక్కడికి వెళ్లాలి. నేను ఈ విషయాన్ని బహిరంగంగానే చెబుతాను. నేను నమాజ్ చేస్తాను. నాకు సమయం దొరికితే నేను రోజుకు ఐదుసార్లు నమాజ్ చేస్తాను. నేను ప్రయాణించేటప్పుడు నా ప్రేయర్ మ్యాట్ ను కూడా వెంట తీసుకెళ్తాను. నేను ఎక్కడికి వెళ్లినా నాకు అదే శాంతి, ప్రశాంతత లభిస్తుంది. దేవుడు ఒక్కడే.. ఆయనతో అనుసంధానం కావడానికి వేర్వేరు మార్గాలు ఉన్నాయని నేను ఎప్పుడూ బలంగా నమ్ముతాను. నేను ఆ మార్గాలన్నింటినీ అన్వేషించాలనుకుంటున్నా” అని నటి నుస్రత్ తేల్చి చెప్పారు. ఇక సినిమాల విషయానికి వస్తే.. ఈ నటి ‘బన్ టిక్కీ’ అనే చిత్రంలో నటించనుంది.

Also Read: సామాన్యులకు బిగ్ అలర్ట్! జనవరి 1 నుంచి కొత్త రూల్స్ ఇవే, మీ జేబుకు చిల్లు పడినట్టే..?