Navjot Sidhu : పంజాబ్ లో విద్యుత్ కోతల అంశం రాజకీయంగా మంటలు రాజేస్తోంది. సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్పై కాంగ్రెస్ నేత నవజోత్ సింగ్ సిద్ధూ ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. విమర్శలతో విరుచుకుపడ్డారు. ఇతర రాష్ట్రాల కంటే ఎక్కువ ధరకు విద్యుత్ను పంజాబ్ కొనుగోలు చేస్తోందన్న సిద్ధూ.. ప్రైవేట్ విద్యుత్ సంస్థలకు లాభం చేకూర్చే విధంగా చర్యలు ఉన్నట్లు పరోక్షంగా విమర్శలు చేశారు.
అప్పటి బాదల్ ప్రభుత్వం మూడు ప్రైవేట్ విద్యుత్ ఉత్పత్తి సంస్థలతో విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు చేసుకుందని, అయితే తప్పుడు నిబంధనల కారణంగా 5వేల 400 కోట్ల రూపాయలను వృధాగా చెల్లించారని, ఇప్పుడు స్థిర ఛార్జీల పేరుతో 65వేల కోట్ల రూపాయలను పంజాబ్ ప్రజల డబ్బును చెల్లించాలని భావిస్తున్నారని ఆయన ఆరోపించారు.
‘‘విద్యుత్ ధరలు, విద్యుత్ కోతలు, విద్యుత్ కొనుగోలు ఒప్పందాల వాస్తవాలు తెలియాలి. పంజాబ్ ప్రజలకు 24 గంటల ఉచిత విద్యుత్ ఎలా ఇవ్వాలనే దానిపై సమాలోచనలు చేయాలి. దానికి కొన్ని మార్గాలను అవలంభించాల్సిన అవసరం ఉంది. సీఎం కార్యాలయంలో పాలనా సమయాలు మార్చుకోవడంతోనో ప్రజల ఇళ్లల్లో ఏసీలు ఆపేయడంతోనో కరెంటు కోతలు విధించడమో కాకుండా నిర్ధిష్టమైన కార్యచరణ ఉంటే సరిపోతుంది’’ అని సిద్ధూ అన్నారు.
పంజాబ్లో 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తామని హామీ ఇచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీపైనా సిద్ధూ విమర్శలు గుప్పించారు. పంజాబ్కు కాపీ మోడల్ అవసరం లేదని అన్న సిద్దూ.. పంజాబ్ ప్రభుత్వం సబ్సిడీ కింద 9వేల కోట్లు చెల్లిస్తోందని, కేవలం 1,699 కోట్లు చెల్లిస్తున్న ఢిల్లీ నేతలు పంజాబ్కు ఏ విధంగా సరిపడా విద్యుత్ అందిస్తారని ఎద్దేవా చేశారు.
పంజాబ్లో తీవ్ర విద్యుత్ కోతల నేపథ్యంలో రాష్ట్రంలో విద్యుత్ కష్టాలకు గతంలో అధికారంలో ఉన్న సుఖ్బీర్ సింగ్ బాదల్ నేతృత్వంలోని శిరోమణి అకాలీదళ్ (ఎస్ఏడీ) సర్కార్ నిర్వాకమే కారణమని నవజ్యోత్ సింగ్ సిద్ధూ ఆరోపించారు. విద్యుత్ సమస్యను పరిష్కరించేందుకు నూతన చట్టాన్ని తీసుకురావాలని పిలుపు ఇచ్చారు. రాష్ట్ర ప్రజలకు నిరంతర విద్యుత్ సరఫరా కోసం అవసరమైన చర్యలు చేపట్టాలని వరుస ట్వీట్లలో సూచించారు. రాష్ట్రంలో పవర్ క్రైసిస్ ను ఉద్దేశించి సిద్దూ మొత్తం 9 ట్వీట్లు చేశారు.