Currency Notes: సరికొత్త వివాదానికి తెరలేపిన కేజ్రీవాల్ వ్యాఖ్యలు.. కరెన్సీ నోట్లపై అంబేద్కర్, మోదీ ఫొటోలు వేయాలంటూ డిమాండ్లు
ప్రధానమంత్రి నరేంద్రమోదీ చిత్రాన్ని సైతం కరెన్సీ నోట్లపై ముద్రించాలంటూ డిమాండ్లు వస్తున్నాయి. భారతీయ జనతా పార్టీకి చెందిన రాం కదం అనే నేత నరేంద్రమోదీ చిత్రాన్ని కరెన్సీ నోట్లపై ముద్రించాలంటూ డిమాండ్ చేశారు. ఆయనతో పాటు ఛత్రపతి శివాజీ మహరాజ్, డాక్టర్ బాబాసాహేబ్ అంబేద్కర్, వీడీ సావర్కర్ చిత్రాలను సైతం కరెన్సీ నోట్లపై ముద్రించాలని డిమాండ్ చేశారు.
- tony bekkal
- Published On : October 27, 2022 / 08:17 PM IST
New sparks erupts on kejriwal comments on currency notes to be printed by laxmi and ganesh
Currency Notes: కరెన్సీ నోట్లపై గణపతి, లక్ష్మీ దేవుళ్ల ఫొటోలు ముద్రించాలంటూ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలు సరికొత్త డిమాండ్లకు తావు నివ్వడమే కాకుండా సరికొత్త వివాదానికి సైతం తెర లేపింది. ఎవరి వారు తమ తమ డిమాండ్లను ముందర పెడుతూ వారు చెప్పే వ్యక్తుల ఫొటోలను కరెన్సీ నోట్లపై ముద్రించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఇందులో ప్రధానంగా రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఫొటోను కరెన్సీ నోట్లపై ముద్రించాలని డిమాండ్ వస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారి ఈ డిమాండ్ చేశారు.
గురువారం మనీష్ తివారి తన ట్విట్టర్ ఖాతా ద్వారా స్పందిస్తూ ‘‘కొత్త సిరీస్ కరెన్సీ నోట్లపై డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఫొటో ఎందుకు ఉండకూడదు? నోటుకు ఒకవైపు నతవహించిన మహాత్మా గాంధీ బొమ్మ, మరో వైపు డాక్టర్ అంబేద్కర్ బొమ్మ ఉండాలి. అహింస, రాజ్యాంగవాదం, సర్వసమానత్వం విశిష్ట సమ్మేళనంలో లీనమవుతాయి. అలాంటపుడు ఆధునిక భారతీయ బుద్ధి కుశలత అత్యంత కచ్చితమైన రీతిలో వ్యక్తమవుతుంది’’ అని రాసుకొచ్చారు.
ఇక ఈయన డిమాండ్ చేసిన అనంతరమే రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (ఏ) అధినేత, కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే సైతం ఇదే డిమాండ్ చేశారు. కరెన్సీ నోట్లపై అంబేద్కర్ ఫొటో ఉండాల్సిందేనని ఆయన పట్టుబడుతున్నారు. ‘‘దేశం గర్వించదగ్గ ప్రముఖ వ్యక్తులు ఇద్దరు. ఒకరు మహాత్మ గాంధీ అయితే మరొకరు బాబాసాహేబ్ అంబేద్కర్. అయితే మహాత్మగాంధీ చిత్రాన్ని కరెన్సీ నోట్లపై ముద్రిస్తున్నారు. చాలా కాలం క్రితమే ఇది ప్రారంభించారు. కానీ అంబేద్కర్ చిత్రం మాత్రం వేయడం లేదు. ఈ దేశ రాజ్యాంగం రాసిన అంబేద్కర్ చిత్రాన్ని కరెన్సీ నోట్లపై వేయాల్సిందే’’ అని అథవాలె అన్నారు.
వాస్తవానికి ఈ డిమాండ్ ఎప్పటి నుంచో వస్తోంది. ముఖ్యంగా దళిత సంఘాలు, అంబేద్కర్ సమూహాల నుంచి ఎప్పటి నుంచో వస్తోంది. ఇదే విషయాన్ని అథవాలె సైతం ఊటంకించారు. ఇకపోతే.. ప్రధానమంత్రి నరేంద్రమోదీ చిత్రాన్ని సైతం కరెన్సీ నోట్లపై ముద్రించాలంటూ డిమాండ్లు వస్తున్నాయి. భారతీయ జనతా పార్టీకి చెందిన రాం కదం అనే నేత నరేంద్రమోదీ చిత్రాన్ని కరెన్సీ నోట్లపై ముద్రించాలంటూ డిమాండ్ చేశారు. ఆయనతో పాటు ఛత్రపతి శివాజీ మహరాజ్, డాక్టర్ బాబాసాహేబ్ అంబేద్కర్, వీడీ సావర్కర్ చిత్రాలను సైతం కరెన్సీ నోట్లపై ముద్రించాలని డిమాండ్ చేశారు. బుధవారం ప్రారంభమైన ఈ వివాదం రానున్న రోజుల్లో మరెన్ని డిమాండ్లను లేవనెత్తుతుందో, ఈ డిమాండ్లపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.
Nehru Follies: కశ్మీర్ అంశంలో నెహ్రూ తప్పిదాలు అంటూ విమర్శలు గుప్పించిన కేంద్ర మంత్రి రిజిజు
