రాజకీయాల్లో మర్యాద : శశిథరూర్‌కి నిర్మలా సీతారామన్ పరామార్శ

  • Publish Date - April 16, 2019 / 08:16 AM IST

తులాభారంలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ కేంద్ర మంత్రి శశిథరూర్‌ను కేంద్ర రక్షణమంత్రి నిర్మలా సీతారామన్‌ పరామర్శించారు. ఆమె పరామార్శించడం పట్ల శశిథరూర్ కృతజ్ఞతలు తెలియచేశారు. రాజకీయాల్లో మర్యాద చాలా అరుదుగా కనిపిస్తుందని..ఇందుకు రక్షణ శాఖ మంత్రే ఉదహారణ అని కొనియాడారు. ఏప్రిల్ 16వ తేదీ ఎన్నికల ప్రచారం నిమిత్తం నిర్మలా సీతారామన్ కేరళకు వెళ్లారు.

ఈ సందర్భంగా తిరువంతనపురం మెడికల్ కాలేజీకి వెళ్లి శశిథరూర్ ఆరోగ్య పరిస్థితిపై నిర్మల వాకబు చేశారు. కేరళ ఎన్నికల ప్రచారంలో బిజిబిజీగా ఉన్నా నిర్మలా సీతారామన్ వచ్చి పరామర్శించడం సంతోషంగా ఉందన్నారు శశి థరూర్. భారత రాజకీయాల్లో మర్యాద అనేది అత్యంత అరుదుగా కనిపించే దృశ్యమన్నారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు. 
తిరువనంతపురం లోక్ సభ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న శశి థరూర్ గాంధారి అమ్మాన్ టెంపుల్‌‌లో నిర్వహిస్తున్న తులాభారంలో పాల్గొని గాయపడిన సంగతి తెలిసిందే. ఆయనను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారు.