Big Promise By Nitish: కూటమి కట్టనేలేదు.. అప్పుడే, అధికారంలోకి వస్తే అంటూ పెద్ద పెద్ద హామీలు ఇస్తున్న నితీశ్
బీజేపీ అధికారంలోకి వచ్చాక అది సాధ్యం కాదంటూ కొట్టిపారేసింది. ఒడిశా, బిహార్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, రాజస్తాన్ వంటి రాష్ట్రాలు తమకు ప్రత్యేక హోదా కావాలంటూ ఎప్పటి నుంచో అర్జీలు పెట్టుకుంటున్నాయి. అయితే వాస్తవంలో ఇది సాధ్యం కాదనే అంచనాలు మాత్రం రాజకీయ నేతలకు ఉన్నప్పటికీ.. రాజకీయ అవసరాల కోసమైనా వీటిని వాడుకుంటున్నారు
- tony bekkal
- Published On : September 15, 2022 / 03:11 PM IST
Nitish Kumar Big Promise If Opposition Comes To Power In 2024
Big Promise By Nitish: ‘ఆలు లేదు, చూలు లేదు కానీ కొడుకు పేరు సోమలింగం’ అనే సామెత బహుశా నితీశ్ విషయంలో ఉపయోగించవచ్చేమో! ఎందుకంటే, కేంద్రంలోని భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా కూటమి ప్రయత్నాల్లో ఉన్న ఆయన.. కూటమికి సంబంధించి ఒక్క అడుగూ ముందుకు పడ్డట్టు కనిపించడం లేదు. అంతలోనే ప్రతిపక్షాలు అధికారంలోకి వస్తే అంటూ హామీలు కురిపిస్తున్నారు. చిన్నా చితకా హామీలు కూడా కాదు. చాలా పెద్ద పెద్ద హామీలే ఇస్తున్నారు.
తాజాగా ఆయన పాట్నాలో మీడియాతో మాట్లాడుతూ 2024 సాధారణ ఎన్నికల్లో విపక్షాలు అధికారంలోకి వస్తే దేశంలో వెనుకబడిన రాష్ట్రాలకు ప్రత్యేక హోదా కల్పిస్తామని హామీ ఇచ్చారు. గురువారం నితీశ్ మీడియాతో మాట్లాడుతూ ‘‘ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం కనుక లభించినట్లైతే వెనుకబడిన రాష్ట్రాలకు కచ్చితంగా ప్రత్యేక హోదా ఇస్తాం. నేను కేవలం బిహార్ గురించి మాత్రమే మాట్లాడటం లేదు. దేశంలోని అన్ని రాష్ట్రాల గురించి మాట్లాడుతున్నాను. ముఖ్యంగా బీజేపీయేతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలకు తొలి ప్రాధాన్యత ఇస్తాం’’ అని అన్నారు. దేశంలోని అనేక రాష్ట్రాలు ఈ విషయమై అనేకసార్లు గళమెత్తాయి. మొన్నటికి మొన్న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంటూ అప్పట్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ హడావుడి చేసింది. బీజేపీ కూడా దీన్ని బలంగానే సమర్ధించింది. దాంతో విభజన చట్టంలో అయితే హోదా వచ్చింది.
కానీ, బీజేపీ అధికారంలోకి వచ్చాక అది సాధ్యం కాదంటూ కొట్టిపారేసింది. ఒడిశా, బిహార్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, రాజస్తాన్ వంటి రాష్ట్రాలు తమకు ప్రత్యేక హోదా కావాలంటూ ఎప్పటి నుంచో అర్జీలు పెట్టుకుంటున్నాయి. అయితే వాస్తవంలో ఇది సాధ్యం కాదనే అంచనాలు మాత్రం రాజకీయ నేతలకు ఉన్నప్పటికీ.. రాజకీయ అవసరాల కోసమైనా వీటిని వాడుకుంటున్నారు. ఇప్పుడు ఉన్నట్టుండి నితీశ్ ఆ అంశాన్ని లేవనెత్తి పెద్ద చర్చ తెరలేపారు. వాస్తవానికి ఈ అంశంతో బీజేపీయేతర స్థానిక పార్టీలను మచ్చిక చేసుకోవాలని నితీశ్ ప్రయత్నిస్తూ ఉండవచ్చు. ఇప్పటి వరకు కొనసాగిన ప్రయత్నాలు ఆశించినంత ఫలితాన్ని ఇవ్వలేదనే మాట వినిపిస్తోంది. బహుశా అందుకే కొత్త ఎత్తుగడ వేసి ఉండవచ్చని విశ్లేకుల అంచనా.
Election Commission: 253 పార్టీల గుర్తింపు రద్దు.. కారణం ఏంటంటే..?
