AC coaches for trains running at 130/160 kmph రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. గుర్తించిన మార్గాల్లో ఇకపై గంటకు 130 కి.మీ, అంతకన్నా ఎక్కువ వేగంతో ప్రయాణించే రైళ్లలోని స్లీపర్ కోచ్లు అన్నింటినీ ఏసీ కోచ్లుగా మార్చనున్నట్లు భారతీయ రైల్వే తెలిపింది. రైల్వే నెట్ వర్క్ అప్ గ్రేడేషన్((ప్రయాణ సమయాన్ని మరింత తగ్గించడం,ఇతర సౌకర్యాలను పెంచడం) లో భాగంగా ఈమేరకు మార్పులు చేస్తున్నట్లు ఆదివారం(అక్టోబర్-11,2020)ఓ సీనియర్ అధికారి తెలిపారు.
అయితే, ఆ రైళ్లల్లో ప్రయాణికులకు సరసమైన ధరలకే టికెట్లు అందుబాటులో ఉంటాయని రైల్వే శాఖ ప్రతినిధి డీజే నారాయన్ తెలిపారు. ప్రస్తుతం అనేక మార్గాల్లో మెయిల్ లేదా ఎక్స్ప్రెస్ రైళ్లు గంటకు 110కి.మీ లేదా అంతకంటే తక్కువ వేగంతో ప్రయాణిస్తున్నాయి. రాజధాని, శతాబ్ది, దురంతో వంటి ప్రీమియం రైళ్లు మాత్రం 120 కి.మీ వేగంతో తిరుగుతున్నాయి.
అయితే.. వీటి వేగ సామర్థ్యం మరింత పెంచేందుకు రైల్వే శాఖ ప్రణాళికలు సిద్ధం చేసిందని డీజే నారాయణ్ తెలిపారు. వాటికి అనుగుణంగా ఆయా రైళ్లకు సాంకేతికంగా ఏసీ కోచ్లు అమర్చడం అనివార్యమైందని ఆయన తెలిపారు. ప్రస్తుతం 83 రైళ్లలో ఈ ప్రక్రియ చేపట్టాని, ఈ ఏడాదిలోగా 100, వచ్చే సంవత్సరంలో 200 కోచ్లను ఏర్పాటు చేసే ప్రయత్నాలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. అయితే.. 110 కిలోమీటర్ల వేగంతో నడుస్తోన్న రైళ్లలో నాన్-ఏసీ బోగీలు యథాతథంగా ఉంటాయని నారాయణ్ స్పష్టం చేశారు.