Operation Mahadev: శ్రీనగర్లో ‘ఆపరేషన్ మహదేవ్’ పేరుతో భారీ ఎన్కౌంటర్.. ముగ్గురు పహల్గాం ఉగ్రవాదులు హతం..?
శ్రీనగర్లోని దాచిగమ్ నేషనల్ పార్కు సమీపంలో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు.
- Harishth Thanniru
- Published On : July 28, 2025 / 02:11 PM IST
jammu kashmir operation mahadev
Pahalgam Attack: జమ్మూ కశ్మీర్ శ్రీనగర్లోని దాచిగమ్ నేషనల్ పార్కు సమీపంలో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ భీకర కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. అయితే, మృతిచెందిన ఉగ్రవాదులు పహల్గాం దాడికి పాల్పడిన వారిగా ప్రచారం జరుగుతోంది. దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
హర్వాన్ ప్రాంతంలో ఉగ్రవాదులు దాక్కున్నట్లు నిఘా వర్షాల సమాచారంతో జమ్మూకశ్మీర్ పోలీసులు, భారత సైన్యం, సీఆర్పీఎఫ్ సంయుక్తంగా ‘ఆపరేషన్ మహదేవ్’ చేపట్టింది. సోమవారం ఉదయం దాచిగమ్ అటవీ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపడుతున్న క్రమంలో భద్రతా దళాల పైకి ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఎదురు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు.
మృతిచెందిన ముగ్గురూ విదేశీ ఉగ్రవాదులని, లష్కరే తోయిబాకు చెందినవారని సమాచారం. ఘటనాస్థలిలో ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. అయితే, వీరు పహల్గాం దాడి ఉగ్రవాదులుగా ప్రచారం జరుగుతుంది. ఈ విషయంపై సైన్యం అధికారిక ప్రకటన చేయలేదు.
భారత సైన్యంకు చెందిన చినార్ కార్ప్స్ ప్రకటన ప్రకారం.. ఉదయం 11గంటలకు ఎన్ కౌంటర్ ప్రారంభమైంది. కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది. ఉగ్రవాదుల ఆచూకీని గుర్తించేందుకు డ్రోన్లను కూడా వినియోగిస్తున్నారు.
