President election 2022: ఈనెల 18న జరగనున్న రాష్ట్రపతి ఎన్నికపై సర్వత్రా ఉత్కంఠ కొనసాగుతోంది. బీజేపీకి పోటీగా ఉమ్మడి ప్రతిపక్ష పార్టీలు అభ్యర్థిని బరిలోకి దింపేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఈ క్రమంలో పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నేతృత్వంలో రేపు ఢిల్లీలో రాష్ట్రపతి పదవికి ఉమ్మడి ప్రతిపక్షం అభ్యర్థిపై చర్చజరగనుంది. మంగళవారం సాయంత్రానికే మమత బెనర్జీ ఢిల్లీకి చేరుకున్నారు. 22మంది ప్రతిపక్ష నేతలకు రాష్ట్రపతి ఎన్నిక నేపథ్యంలో ఉమ్మడి ప్రతిపక్ష పార్టీల అభ్యర్థి పై చర్చించేందుకు హాజరుకావాలని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ లేఖ రాశారు. అయితే మమతాబెనర్జీ ఆహ్వానం మేరకు రేపు మధ్యాహ్నం 3గంటలకు కాన్స్ట్యూషన్ క్లబ్ లో జరిగే సమావేశానికి ఏఏ పార్టీల నుంచి ఎవరెవరు హాజరువుతారనే అంశంపై ఉత్కంఠ కొనసాగుతుంది.
Mamata Banerjee: బీజేపీకి 2024లో నో ఎంట్రీ: మమతా బెనర్జీ
మమతాబెనర్జీ నేతృత్వంలో జరిగే సమావేశానికి కాంగ్రెస్ పార్టీ నుంచి మల్లికార్జున ఖర్గే, రణదీప్ సూర్జేవాలా, జైరామ్ రమేష్ లు హాజరయ్యే అవకాశం ఉంది. ఇందుకోసం కాంగ్రెస్ అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు తెలుస్తోంది. డీఎంకే నుంచి టిఆర్ బాలు, సీపీఐ(ఎం) నుంచి ఎంపీ ఎలమరం కరీం, సీపీఐ నుంచి ఎంపీ బినోయ్ విశ్వం, ఎన్సీపీ నుంచి శరద్ పవార్ హాజరు కానున్నట్లు సమాచారం. ఈ సమావేశంకు తెలంగాణ సీఎం కేసీఆర్ హాజరువుతారా లేదా అన్నఅంశం ఉత్కంఠగా మారింది. రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా టీఆర్ఎస్ అడుగులు వేస్తుంది. ఈ క్రమంలో మమత నిర్వహించే సమావేశానికి టీఆర్ఎస్ నుంచి ప్రతినిధులు హాజరువుతారని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతుంది. కానీ ఇప్పటి వరకు టీఆర్ఎస్ అధిష్టానం నుంచి రేపు జరిగే సమావేశంలో పార్టీ ప్రతినిధులు పాల్గొంటారా, పాల్గొనరా అనే విషయంపై స్పష్టత రాలేదు. రేపు సాయంత్రం 3గంటలకు సమావేశం ఉండటంతో బుధవారం ఉదయం నాటికి ఈ అంశంపై టీఆర్ఎస్ నుంచి ప్రకటన వెలువడే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో టాక్ నడుస్తుంది.
ఈ నెల 18న భారత రాష్ట్రపతి ఎన్నికలు జరగనున్నాయి. రేపు రాష్ట్రపతి ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడనుంది. రేపటి నుంచే నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కానుంది. అధికార NDA ఓటర్లలో సగం ఓట్లను కలిగి ఉంది. బీజేపీ అభ్యర్థికి BJD, AIADMKతో పాటు YSR-CP వంటి స్వతంత్ర పార్టీలు మద్దతు ఇచ్చేఅవకాశాలు ఉన్నాయి. వీరు మద్దతుఇస్తే బీజేపీ మద్దతుతో నామినేషన్ వేసిన అభ్యర్థి విజయం సాధించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అయితే రాష్ట్రపతి ఎన్నికను ఏకగ్రీవం చేసేందుకు అధికారపక్షం బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది. రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాకు ప్రధాని మోదీ ఈ బాధ్యతలు అప్పగించినట్లు సమాచారం. కాంగ్రెస్ సహా విపక్షాలు, తటస్థ పార్టీలతో బీజేపీ నేతలు చర్చలు జరిపి రాష్ట్రపతి ఎన్నిక ఏకగ్రీవం చేసేలా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా శరద్ పవార్ను నిలబెట్టేందుకు చర్చలు జరిగాయి. కానీ పవార్ విముఖత వ్యక్తంచేసినట్లు తెలుస్తోంది. రేపు జరిగే సమావేశంలో పవార్ ను ఒప్పించేలా ప్రతిపక్ష పార్టీలు ప్రయత్నాలు చేసే అవకాశం ఉంది.