Maharashtra Hostel : అమరావతి హాస్టల్‌లో దెయ్యాల కలకలం.. 608 మంది విద్యార్థులు ఖాళీ!

Maharashtra Hostel : మహారాష్ట్రలోని బోర్డింగ్ హాస్టల్ ప్రాంగణంలో దెయ్యాలు, అతీంద్రియ శక్తులు తిరుగుతున్నాయనే వదంతుల నేపథ్యంలో మొత్తం 608 మంది విద్యార్థులు హాస్టల్‌ను విడిచిపెట్టినట్లు సమాచారం.

Maharashtra Hostel Amid Ghost Rumours

Maharashtra Hostel : మహారాష్ట్రలోని అమరావతిలో ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న డోమా ట్రైబల్ ఆశ్రమ్ స్కూల్‌ హాస్టల్‌లో దెయ్యాలు, అతీంద్రియ శక్తులు ఉన్నాయనే వదంతులు తీవ్ర కలకలం రేపాయి. రాత్రివేళల్లో కాలి గజ్జల శబ్దాలు, వింత నవ్వులు, ఏడుపులు వినిపిస్తున్నాయని కొందరు విద్యార్థులు ఫిర్యాదు చేయడంతో ఆందోళన రేకిత్తించింది.

ఈ ఘటనల నేపథ్యంలో హాస్టల్‌లోని మొత్తం 608 మంది విద్యార్థులు ఇళ్లకు వెళ్లిపోయినట్లు సమాచారం. వీరిలో 263 మంది బాలురు, 345 మంది బాలికలు ఉన్నారు. ముఖ్యంగా పలువురు బాలికలు రాత్రి వేళల్లో అసాధారణ శబ్దాలు వింటున్నట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సంజయ్ చౌదరి తెలిపారు.

Read Also : 10TV Global Footprints : ఇలాంటి ఈవెంట్ నుంచి నేను చాలా నేర్చుకోవాలి.. హీరో శ్రీకాంత్

ఫిర్యాదులను అధికారులు సీరియస్‌గా తీసుకుని, కొంతమంది బాలికలను ఆసుపత్రికి తరలించి మానసిక వైద్యుడితో పరీక్షలు చేయించినట్లు వెల్లడించారు. పరీక్షల అనంతరం, వారి లక్షణాలు తీవ్రమైన హిస్టీరియా వంటి పరిస్థితికి సంబంధించినవై ఉండొచ్చని వైద్యుడు సూచించినట్లు చౌదరి తెలిపారు.

అయితే, దెయ్యాల వదంతులపై అధికారికంగా ఎలాంటి నిర్ధారణ లేదు. భయాందోళనల కారణంగానే విద్యార్థులు హాస్టల్ ఖాళీ చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.